నిరాహార దీక్ష చేస్తా, బాబు మనిషేనా: ఏకేసిన జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఆయన ఏం చేయలేదన్నారు.
చంద్రబాబు తాను ఇచ్చిన హామీ, మాటలు ఏం నిలబెట్టుకున్నారో ఆయన మనస్సాక్షికే తెలియాలన్నారు. చంద్రబాబు పాలనను నిలదీసేందుకు తాము మూడు నెలల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ధర్నా, ఆందోళనల్లో అందరు పాల్గొనాలన్నారు. ఈ మూడు నెలలు పాటు ఆందోళనలు ఉంటాయన్నారు.
రేపటి నుండి ప్రతి మండలంలో దీక్షలు ఉంటాయన్నారు. చంద్రబాబు ఏం చేశారో గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తనకు అన్నీ తెలుసునని, ఇబ్బందులు తెలిసే.. వాటిని తీర్చగలనని హామీలు ఇస్తున్నానని ఈసీకి లేఖ రాశారన్నారు.
ఏప్రిల్ 11న ఆయన ఈసికి లేఖ రాశారన్నారు. ఈసికి లేఖ రాయడం కంటే ముందే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు వేర్వేరుగా మేనిఫెస్టోలు విడుదల చేశారన్నారు. టీవీలలో ప్రచారంతో ఊదరగొట్టారరని అభిప్రాయపడ్డారు. హోర్డింగులకు లైట్లు కూడా పెట్టారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ తాను జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు నిరాహార దీక్షలో కూర్చుంటానని చెప్పారు. దేశం బాగుపడాలంటే రైతులు బాగుండాలని చంద్రబాబు చెప్పారని, మొదటి సంతకం రైతు రుణమాఫీ పైన చేస్తానని చెప్పారని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పారని, కానీ ఏం చేశారని మండిపడ్డారు.
ఇంటికో ఉపాధి అన్న చంద్రబాబు ఏమీ చేయడం లేదన్నారు. చంద్రబాబు పుణ్యాన రైతుల నుండి బ్యాంకులు అపరాధ వడ్డీ వసూలు చేస్తున్నాయన్నారు. 87వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని, 14,204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని చెప్పారు.
బాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదని, దీంతో రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతుల వడ్డీలే రూ.28వేల కోట్లు ఉంటే, ఆయన ఇచ్చింది రూ.5వేల కోట్లు మాత్రమే అన్నారు. ఈ ఏడాది పూర్తయితే మరో 14వేల కోట్ల వడ్డీ అవుతుందన్నారు. రైతులకు క్రాప్ ఇన్సురెన్స్ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబుది మోసపూరిత పాలన అన్నారు.
రాజధానిపై...
రాజధాని పైన తాము చంద్రబాబుకు ముందే సూచనలు చేశామన్నారు. ముప్పై వేల ఎకరాలు చాలని తాము ఎప్పుడో చెప్పామన్నారు. రాజధాని కోసం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ అంటున్నారని, కానీ రైతులు దానిని వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అటవిక పాలన సాగుతోందన్నారు.
భూమా పైన హత్యాయత్నం కేసా?
భూమా నాగిరెడ్డి పైన హత్యాయత్నం కేసు అమానుషమన్నారు. గొడవ పడితే హత్యాయత్నం కేసు పెడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అసలు మనిషేనా అని ప్రశ్నించారు.