నాటి పట్టు మళ్లీ చిక్కేనా: ఈ నెల 25న జగన్.. !!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.
అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాలకే పరిమితమైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకోవడం, అదే స్థాయిలో స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.

ఇందులో భాగంగా.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన ఓ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ శ్రేణులను కిందిస్థాయి నుంచి సిద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ ఇన్ఛార్జ్లకు స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ధీటుగా స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ కీలక భేటీలో నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా పనిచేసేలా క్యాడర్లో భరోసా నింపనున్నారు. అధికార కూటమి ప్రజావ్యతిరేక విధానాలపై ఎలా గళమెత్తాలనే అంశంపై కూడా జగన్ ఈ సందర్భంగా వారికి మార్గదర్శనం చేసే అవకాశం ఉంది.
ఈ మధ్యకాలంలో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న అతిపెద్ద సమావేశం ఇదే కావడంతో దీనిపై అందరి దృష్టి నిలిచింది. స్థానిక ఎన్నికల సన్నద్ధత మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో నాయకత్వ లోపాలను సరిదిద్దేందుకు ఈ సమావేశాన్ని ఓ వేదికగా జగన్ ఉపయోగించుకోనున్నారు. ఈ నెల 25న జరగబోయే ఈ విస్తృత స్థాయి భేటీ భవిష్యత్తులో పార్టీ రాజకీయ ప్రయాణానికి ఎంతో కీలకం కానుంది.













Click it and Unblock the Notifications