భూమా నమ్మకద్రోహం!: జగన్ బాధ, కోర్టుకి వచ్చి, ఎమ్మెల్యేలతో చర్చ
కడప: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియలు తెలుగుదేశం పార్టీలో చేరడంపై వైసిపి అధినేత జగన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భూమా నాగిరెడ్డి నమ్మకద్రోహం చేశారని పార్టీ నేతలతో జగన్ ఆవేదనగా చెప్పారని తెలుస్తోంది.
భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మొత్తం అయిదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ సైకిల్ ఎక్కారు. అయితే, మిగిలిన వారి కంటే భూమా చేరిక పైనే జగన్ తీవ్ర కలత చెందుతున్నారని తెలుస్తోంది.
పార్టీ నుంచి మరికొంతమంది నేతలు చేజారకుండా జగన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్... భూమా కుటుంబం గురించి ప్రస్తావిస్తూ బాధపడుతున్నారని తెలుస్తోంది.
Photos: టిడిపిలోకి జంప్

శోభా నాగిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం ఇచ్చామని, ఆమె మృతి అనంతరం ఆళ్లగడ్డలో ఆమె కూతురు అఖిల ప్రియను బరిలో దింపామని, భూమా నాగిరెడ్డికి కూడా ప్రాధాన్యత ఇచ్చామని, కానీ చివరకు భూమా నాగిరెడ్డి తనకు నమ్మక ద్రోహం చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
మరోవైపు, గతంలో జగన్ లేదా షర్మిల ఓదార్పు యాత్ర, పరామర్స యాత్రలు నిర్వహించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో జగన్ ఇప్పుడు తన ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు, టిడిపి ఆపరేషన్ ఆకర్ష్కు లోనుకాకుండా ఉండేందుకు ఆపరేషన్ చెక్ యాత్ర చేస్తున్నారని చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా.. అటొకరు, ఇటొకరు ఉంటాం అంటే కుదరదని, ఎక్కడెక్కడ ఏం జరుగుతోందనేది తన వద్ద నివేదికలు ఉన్నాయని, అందరూ కలిసి పనిచేయాలని, కొత్తవారు వస్తుంటే వద్దని చెప్పవద్దని, ఎవరు వచ్చినా తీసుకుంటామని, సర్దుకుపోవాలని లోకేష్ కడప జిల్లా టీడీపీ నేతలకు స్పష్టం చేశారు.
జిల్లాలో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఏడు నియోజకవర్గాల సమీక్షలు జరిపారు. రాజంపేట, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు, కడప అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుతో కలిసి వరుసగా సమీక్షలు జరిపారు.
కోర్టుకు హాజరైన జగన్, కలిసిన వైసిపి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ శుక్రవారం నాడు తన కేసు విషయమై నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే ఉండవలసి ఉంది. ఈ నేపథ్యంలో విరామం సమయంలో ఆయనను ప్రకాశం జిల్లా వైసిపి ఎమ్మెల్యేలు కలిశారు. తాము మీ వెంటే ఉంటామని జగన్కు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ... తాము పార్టీ మారుతామని అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము పార్టీ మారేది లేదన్నారు. తాము పార్టీ మారితే నిధులు ఇస్తామని చెబుతున్నారన్నారు. జగన్ వెంటే చివరి వరకు ఉంటామన్నారు.












Click it and Unblock the Notifications