బుద్ధి తెచ్చుకో, ఓటుకు నోటు ఎఫెక్ట్: చంద్రబాబుకు జగన్ హెచ్చరిక
విశాఖ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమర్నాథ్ వంటి యువకులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని వైసిపి అధినేత జగన్ సోమవారం నాడు ధ్వజమెత్తారు. విశాఖ రైల్వే జోన్ కోసం దీక్ష చేసిన గుడివాడ అమర్నాథ్కు జగన్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయి రెండేళ్లవుతోందని, అయినా ఇప్పటి వరకు ఏం చేయలేదన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక హోదా, రైల్వే జోన్.. ఎలా ఏ హామీని నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేకపోయారన్నారు. మీ వాళ్లను కేంద్రంలో మంత్రులుగా ఎందుకు ఉంచుతున్నారని జగన్ ప్రశ్నించారు.
ఓటుకు నోటుకు భయపడే చంద్రబాబు కేంద్రాన్ని హామీల విషయంలో నిలదీయడం లేదన్నారు. ఇలా అయితే ప్రజలు ఆయనను తరిమి కొట్టే రోజు వస్తుందన్నారు. హామీలు ఇచ్చి విస్మరించడం చంద్రబాబుకు అలవాటు అన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతోందన్నారు.
రైల్వే జోన్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. చంద్రబాబు తన మంత్రులను కేంద్రంలో వెనుకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు ముందు ఉందన్నారు. చంద్రబాబు తన పాలన గురించి సొంత డబ్బా కొట్టుకుంటున్నారన్నారు.
చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో ధర్నాలు, దీక్షలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమర్నాథ్ దీక్ష ఆపినంత మాత్రాన ఉద్యమం ఆగదని, కొనసాగుతుందని చెప్పారు.
చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని ఎన్నో చెప్పి వేటినీ నెరవేర్చలేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారని, కానీ ఆ హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక హోదాను అడిగే నాథుడే లేకుండా పోయాడన్నారు.
మనకు నాలుగు డివిజన్లు ఉన్నప్పటికీ ఒక్క జోన్ కూడా రాలేదన్నారు. మొన్న ఆర్ఆర్బీ పరీక్షలు నిర్వహిస్తే మనవాళ్లు ఒడిషాకు వెళ్లి పరీక్షలు రాస్తామంటే రానివ్వలేదని, తరిమి కొట్టారని, మనకు ప్రత్యేక జోన్ ఉంటేనే లబ్ధి చేకూరుతుందన్నారు.
ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న విషయం పైన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆడియో వీడియో టేపులతో బయటపడ్డ విషయంపై ఎక్కడ విచారణ జరుగుతుందోనని భయపడి చంద్రబాబు 5 కోట్ల ఏపీ ప్రజల ప్రయోజనం పక్కన పెట్టారన్నారు.