YS Jagan : ఢిల్లీ బయలుదేరిన జగన్ ! రేపు దౌత్యవేత్తలతో భేటీ- పెట్టుబడుల వేట !
ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో రేపు నిర్వహిస్తున్న కర్టెన్ రైజర్ ఈవెంట్ లో పాల్గొనేందుకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది మార్చిలో విశాఖ వేదికగా జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు సన్నాహకంగా వివిధ నగరాల్లో కర్టెన్ రైజర్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో రేపు జరిగే ఈవెంట్ కు వైఎస్ జగన్ హాజరవుతున్నారు. ఇవాళ ఢిల్లీలోని అధికారిక నివాసం 1 జనపథ్ లో బస చేయనున్న జగన్ రేపు ఈ ఈవెంట్ లో పాల్గొంటారు.
ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖ నగరంలో ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో ఓ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీ సహా వివిధ నగరాల్లో కర్టెన్ రైజర్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. రేపు ఢిల్లీలో ఇలాంటి కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. వివిధ దేశాల నుంచి దౌత్యవేత్తల్ని సైతం దీనికి ఆహ్వనించారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై వీరికి ప్రభుత్వం ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది.
రేపు ఢిల్లీలో చేపట్టే కర్టెన్ రైజర్ ఈవెంట్ కు 28 మంది విదేశీ పెట్టుబడిదారులతో పాటు 44 మంది దౌత్యవేత్తల్ని ఆహ్వనించారు. ఏపీ అడ్వాంటేజ్ ధీమ్ తో వీరికి రాష్ట్రంలో పెట్టుబడుల వల్ల ప్రయోజనాల్ని సీఎం జగన్ సహా అధికారులు వివరించబోతున్నారు. వీరికి నమ్మకం కుదిరితే మార్చిలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరవుతారు. దీంతో ఈ కార్యక్రమం ఏపీకి కీలకంగా మారింది. వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలతో భేటీ కానున్న జగన్.. తమ దేశాల్లో పెట్టుబడిదారుల్ని ఏపీకి వెళ్లేలా ప్రోత్సహించాలని కోరబోతున్నారు.