ఏపీలో నేడు కీలక పథకం - 28న మళ్లీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల్లో ఒకటి నాడు-నేడు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చివేయడానికి ఉద్దేశించిన ఈ పథకం కింద కోట్ల రూపాయలను వ్యయం చేస్తోంది ప్రభుత్వం. దీనికి అనుబంధంగా విద్యార్థుల కోసం కిట్లను కూడా పంపిణీ చేస్తోంది.
ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలోనే వాటిని స్టూడెంట్స్కు అందజేస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తోంది ప్రభుత్వం. పాఠశాలలు పునః ప్రారంభం రోజే స్టూడెంట్లందరికీ జగనన్న విద్యా కానుక కింద కిట్ల పంపిణీని చేపట్టనుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు.

దీని కోసం సోమవారం ఆయన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు జగన్. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజినీ తదితరులు హాజరు కానున్నారు. జూన్ 12వ తేదీ నాడే స్కూళ్లు పూర్తిస్థాయిలో రీఓపెన్ కావాల్సి ఉన్నప్పటికీ.. ఎండ తీవ్రత తగ్గకపోవడం వల్ల దాన్ని ఒంటిపూటగా బదలాయించింది.
కాగా- జగనన్న విద్యా కానుక కింద స్టూడెంట్లకు అందజేసే ఒక్కొక్క కిట్ విలువ 2,500 రూపాయలు. ఒక్కో కిట్లో మూడు జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు ఉంటాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోట్ బుక్స్ కూడా కిట్స్ ద్వారానే అందజేస్తుంది ప్రభుత్వం. ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీని ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోంది.
జగనన్న గోరుముద్ద కింద రాగి జావను కూడా ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీన అమ్మఒడి నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. వైఎస్ జగన్ బటన్ నొక్కి ఈ నిధులను తల్లుల అకౌంట్లలోకి జమ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అటు జగనన్న విద్యా కానుక కింద కిట్ల పంపిణీ, ఈ నెలాఖరున అమ్మఒడి నిధులను మంజూరు చేయబోతోన్నారు.












Click it and Unblock the Notifications