వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార తేదీలో మార్పు లేదు
YS Jagan oath taking ceremony: ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీపై నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డీ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. 151కి పైగా అసెంబ్లీ, 22 లోక్సభ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తామంటూ ఐప్యాక్ టీమ్ సమావేశంలో స్వయంగా వెల్లడించారు కూడా. అటు మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇదే ధీమా వ్యక్తమౌతోంది.
ఈ క్రమంలో వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకార తేదీని సైతం ఖరారు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు.తాజాగా- వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. అనుమానాలు కూడా పెట్టుకోనక్కర్లేదని స్పష్టం చేశారు.

నేడు ఆయన విశాఖపట్నం చినముషిడివాడలో గల శ్రీ విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట విశాఖపట్నం సౌత్, నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు.అనంతరం వైవీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్పై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, ఓటు రూపంలో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రానికి మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటోన్నారని అన్నారు












Click it and Unblock the Notifications