వైఎస్ జగన్కు తృటిలో తప్పిన ప్రమాదం
YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం గానీ, గాయాలు గానీ కాలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వైఎస్ జగన్ నేడు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మూడురోజుల పాటు పులివెందులలో గడపనున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ను సందర్శిస్తారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పిస్తారు. ఇందుకోసం ఆయన ఈ ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి కడపకు బయలుదేరి వచ్చారు.

కొద్దిసేపటి కిందటే కడప విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు బయలుదేరారు. మార్గమధ్యలో కొప్పర్తి సమీపంలోని రామరాజుపల్లికి చేరుకున్న సమయంలో జగన్ కాన్వాయ్లోని కారు ప్రమాదానికి గురైనట్లు చెబుతున్నారు. కాన్వాయ్లోని ఓ కారును ఫైరింజన్ అదుపు తప్పి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతిన్నది.
ఇడుపులపాయలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఆయనను కలుసుకుంటారు.
మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ మూడు నియోజకవర్గాలకు పరిమితమైన విషయం తెలిసిందే. పులివెందుల, బద్వేలు, రాజంపేటల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన చోట్ల భారీ మెజారిటీతో ఓడిపోయింది. ఈ ఓటమికి గల కారణాలను జగన్ ఆరా తీయనున్నారు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలను తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications