జమిలిపై జగన్ భయాలేంటి ? ఆరు నెలల్లోనే జనంలోకి ఎందుకు ?
ఏపీలో ఎన్నికలు జరిగి ఆరునెలలు పూర్తవుతోంది. ఆరు నెలల క్రితం జనం తమ తీర్పును ఎలాంటి మొహమాటాల్లేకుండా స్పష్టంగానే చెప్పేశారు. ఐదేళ్ల పాటు సాగిన వైసీపీ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. అదీ కనీవినీ ఎరుగని రీతిలో 164 సీట్ల గెలుపుకుని కూటమికి కట్టబెట్టారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అప్పటివరకూ సాగిన వైసీపీ పాలనలో అష్టకష్టాలు పడ్డ తమ పార్టీల నాయకుల్ని, శ్రేణుల్ని సంతృప్తి పర్చేందుకు దూకుడుగా రాజకీయాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి కూడా వెళ్లకుండా బహిష్కరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు.
సంక్రాంతి తర్వాత జగన్ 26 జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రతీ వారం ఓ జిల్లా చొప్పున 26 జిల్లాల్ని చుట్టేయబోతున్నారు. వారానికి రెండు రోజుల పాటు ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ అక్కడే బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జమిలి అంటున్నారని, తాము సిద్దం కావాల్సిన తరుణం వచ్చేసిందని నేతలకు పదే పదే చెప్తున్నారు. దీంతో జగన్ జిల్లాల టూర్ ఆసక్తి రేపుతోంది. అసలే ఆరునెలల క్రితమే తమ తీర్పు చెప్పేసిన ప్రజలు జగన్ ను మళ్లీ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చర్చ కూడా మొదలైంది. ఇంతకీ జగన్ ఇంత త్వరగా జనంలోకి వెళ్లాలని తీసుకున్న నిర్ణయం దేనికి నిదర్శనం అన్న చర్చ సాగుతోంది.

కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలు పూర్తవుతున్న నేపథ్యంలో జనంలోకి వెళ్లి అటో ఇటో తేల్చేసుకోవాలనే ఆరాటం జగన్ లో కనిపిస్తోంది. అయితే దీని వెనుక జమిలి ఎన్నికల భయం కూడా ఉందని చెప్తున్నారు. కేంద్రం ఓవైపు తమ హయాంలో జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెబుతోంది. అయితే అంతకు ముందు సాగాల్సిన జనాభా లెక్కల కసరత్తుతో పాటు నియోజకవర్గాల పునర్ విభజన కసరత్తు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ రెండు కీలకమైన ప్రక్రియలు జరగకుండా జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమే. మరి జగన్ ఏ లెక్క ప్రకారం ఇప్పుడే జనంలోకి వెళ్లాలనుకుంటున్నారన్న ప్రశ్న ఎదురవుతోంది.
వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ లేదా వాటి అధినేతలు ఎన్నికలకు ఏడాది ముందో, ఆరు నెలల ముందో జనంలోకి వెళ్లాలనుకుంటారు. అంతకు ముందే జనంలోకి వెళ్లి ఎన్ని చెప్పినా చివరికి ఎన్నికల నాటికి అవన్నీ గుర్తుండవన్న భావనే దీనికి కారణం. అలాగే క్యాడర్ ను యాక్టివ్ చేసేందుకు పర్యటనలు చేయాలన్నా ఇలా చివరి ఆరునెలల్లోనే పెట్టుకుంటారు. గత ఎన్నికల సమయంలో జగన్ కూడా ఏడాది ముందు హడావిడి ప్రారంభించి ఆరు నెలల క్రితం సిద్దం సభలు నిర్వహించారు. కానీ ఇప్పుడు మాత్రం జమిలి ముందుకు జరుగుతుందన్న భయాలతోనే ఇలా వెంటనే జనంలోకి వెళ్లిపోవడమే బెటర్ అనుకుంటున్నారు.
ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీయేతో పాటు విపక్ష ఇండియా కూటమినీ జనం దాదాపు సమానంగానే ఆదరిస్తున్నారు.ఈ నేపథ్యంలో పరిస్ధితి చేజారకముందే మోడీ జమిలికి వెళ్లిపోతే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతోనే జగన్ ఇలా ముందస్తుగా జనంలోకి వెళ్లిపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచి నిత్యం జనంలోనే ఉంటూ వరుస కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టడం ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్న ఆలోచన కూడా ఉందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications