జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటన కలకలం రేపుతోంది. విజయవాడలో మేమంతా సిద్దం సభ ప్రచారంలో ఉండగా జగన్ పై జరిగిన రాయి దాడిపై వైసీపీ, విపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్దం జరుగుతోంది. అదే సమయంలో ఈసీ కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ కానీ, ప్రత్యక్ష సాక్ష్యులు కూడా లేకపోయినా ఇతర ఆధారాలతో నగరంలో వేముల సతీష్ అనే యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
అయితే జగన్ పై రాయి విసిరిన నిందితుడిగా భావిస్తున్న వేముల సతీష్ తో పాటు అతన్ని ప్రేరేపించినట్లుగా చెప్తున్న వేముల దుర్గారావు, ఇతర అనుమానిత యువకులంతా వడ్డెర కులానికి చెందిన వారు కావడంతో ఈ వ్యవహారం కులం రంగు పులుముకుంటోంది. వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయాల కోసం వడ్డెర కులాన్ని టార్గెట్ చేస్తోందంటూ కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన వడ్డెర సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారంపై ఫైర్ అయ్యాయి.

బీసీ వడ్డెర బిడ్డలపై వైసీపీ మాజీ మంత్రి హత్యాయత్నం కేసు పెట్టించారని వడ్డెర సంఘాల నేతలు ఆరోపించారు. అక్రమంగా ఇరికించి బలవంతంగా ఒప్పించే యత్నం చేస్తున్నారన్నారు. వెంటనే వడ్డెర బిడ్డలను విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరించారు. అధికార దాహం కోసం జగన్ జగన్నాటకంతో వడ్డెర బిడ్డలను బలచేసి అధికారంలో వచ్చేందుకు గులకరాయి డ్రామాకు తెరలేపారని వడ్డెర సంఘం నాయకులు మండిపడ్డారు. బీసీ వడ్డెర బిడ్డలపై హత్యాయత్నం కేసు పెట్టి బలవంతంగా ఒప్పించి ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications