జగన్ లాక్కున్న ఆ ఓటు బ్యాంక్ పైనే షర్మిల గురి ? తాజా చేరికలే సాక్ష్యం..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తాజాగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీలోకి కీలక నేతలను చేర్చుకునే పనిలో ఉన్నారు. అయితే వీరంతా ఎవరని ఆరా తీస్తే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, అప్పట్లో పార్టీ ఓటు బ్యాంకులో కీలకంగా ఉన్నవారే. వీరంతా రాష్ట్ర విభజన తర్వాత వివిధ కారణాలతో వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వారందరికీ షర్మిల రెడ్ కార్పెట్ స్వాగతం చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులో ఏ రాష్ట్రంలో చూసినా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తప్పకుండా ఉంటారు. అయితే స్ధానికంగా ఉన్న పరిస్దితుల ఆధారంగా ఇందులో కొన్ని మార్పులు ఉంటాయి. ఏపీలోనూ దశాబ్దాలుగా ఈ మూడు కీలక సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాయి. కానీ కాంగ్రెస్ లో నుంచి వైఎస్ జగన్ బయటికి వెళ్లిపోయి వైసీపీ స్ధాపించడం, రాష్ట్ర విభజన వంటి కారణాలతో ఈ సామాజిక వర్గాలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశాయి.

అధికారమే పరమావధిగా సాగే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అంతా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతలో వైసీపీకి బదిలీ అయిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కష్టంగా మారిపోయింది. దీంతో గతంలో తమ పార్టీలో పనిచేసిన ఆయా సామాజిక వర్గాల నేతల్ని తిరిగి చేర్చుకుని జగన్ కు సవాల్ విసిరేందుకు ఆయన సోదరి షర్మిల సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎస్సీ నేతలు తాజాగా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నారు. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళి కృష్ణ, నందికొట్కూరు YCP ఎమ్మెల్యే ఆర్థర్ వంటి ఎస్సీ ప్రజాప్రతినిధుల చేరికలే ఇందుకు నిదర్శనం.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ నుంచి లాక్కుని ఇన్నాళ్లూ రాజకీయాలు చేస్తున్న జగన్ పార్టీ వైసీపీలో ఇప్పుడు వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే పోటీతో పాటు అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. దీంతో వైసీపీలో అసంతృప్త నేతలతో పాటు గతంలో పార్టీకి గుడ్ బై చెప్పేశాక స్తబ్దుగా ఉండిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇదంతా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం అందించకపోయినా భవిష్యత్తులో స్ధిరమైన ఓటు బ్యాంకు ఏర్పాటుకు పనికొస్తుందని అంచనా.












Click it and Unblock the Notifications