సీబీఐకి షాకిచ్చిన వైఎస్ వివేకా కుమార్తె..! తెలంగాణ హైకోర్టులో కీలక పిటిషన్..!
ఏపీలో గతంలో దారుణంగా హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఆరేళ్లుగా నత్తనడకన సాగుతోంది. దీని వెనుక రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఉన్నాయన్న సంగతి అందరికీ అర్దమవుతూనే ఉంది. దీనిపై గతంలో సుప్రీంకోర్టు సైతం అక్షింతలు వేసినా సీబీఐ మాత్రం పనితీరు మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తన తండ్రి హంతకులకు శిక్ష పడేలా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్ సీబీఐ కోర్టులో నత్తనడకన జరుగుతున్న సీబీఐ విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి హత్య కేసులో సీబీఐ కోర్టు రోజువారీ విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. నాలుగేళ్లుగా ఈ కేసును సీబీఐ కోర్టు విచారిస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని ఆమె హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తెలంగాణ హైకోర్టు సునీతారెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

అయితే సునీతారెడ్డి తన పిటిషన్ లో సీబీఐని ప్రతివాదిగా చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో హైకోర్టుకు వెళ్లి మరీ ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు తెచ్చుకున్న సునీతారెడ్డి ఇప్పుడు అదే సీబీఐని ఇదే కేసులో ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో సీబీఐ సహా ఆరుగురు నిందితుల్ని ప్రతివాదులుగా చేర్చిన సునీత లాయర్ కు వీరికి నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించింది. అలాగే ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అనంతరం సునీత వినతిపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications