ప్లీనరీ వేదికపై జగన్ - విజయమ్మ : విమర్శలకు చెక్ - తరలి వచ్చిన పార్టీ శ్రేణులు..!!
వైసీపీ ప్లీనరీ సమావేశాల వేళ..విజయమ్మ హాజరు పై ఆసక్తి. సమావేశాలను హాజరు కావటం లేదంటూ వార్తల హల్ చల్. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం. కానీ, వీటన్నింటికి సమాధానం చెబుతూ..తనయుడు జగన్ తో కలిసి తల్లి విజయమ్మ పార్టీ ప్లీనరీ వేదిక మీదకు వచ్చారు. ఇడుపులపాయలో సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రికి నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఆ తరువాత కడప నుంచి గన్నవరం చేరుకున్న ఆ ఇద్దరూ నేరుగా ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్నారు.
కుమారుడుతో కలిసి ప్లీనరీకి
అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ముఖ్యనేతలు వారికి ఘన స్వాగతం పలికారు. పార్టీ వేదిక పైన వైఎస్సార్ కు నివాళి అర్పించారు. సర్వమత ప్రార్ధనలతో సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో సీఎం జగన్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను ప్రతిపాదిస్తూ పార్టీ బైలాస్ లో మార్పుల దిశగా ప్రతిపాదన చేయటం.. రేపు ఆమోదించాలనే నిర్ణయంతో విజయమ్మను పార్టీలో హోదా నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు వినిపించాయి. ఇక, సీఎం జగన్ తోనే తల్లి విజయమ్మ ప్లీనరీ వేదిక పైన కలిసి రావటం..సమావేశాలకు విజయమ్మ హాజరుతో అన్ని విమర్శలకు చెక్ పెట్టినట్లుగా పార్టీ నేతలు భావిస్తున్నారు.
విమర్శలకు- చర్చలకు చెక్
2017 లో ఇదే ప్రాంతంలో జరిగిన ప్లీనరీకి జగన్ తో పాటుగా తల్లి విజయమ్మ.. సోదరి షర్మిల సైతం హాజరయ్యారు. అయితే, ఇప్పుడు షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయటం.. జగన్ ఆ నిర్ణయం తో విభేదించటం.. విజయమ్మ కొంత కాలంగా కుమార్తె షర్మిలతో ఉంటుండటం తో ఈ సారి విజయమ్మ హాజరు పైన ఈ చర్చలకు ఆస్కారం ఏర్పడింది. కానీ, వీటికి విజయమ్మ తన హాజరుతో సమాధానం చెప్పారు. తల్లిగా షర్మిలతో.. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా వైసీపీతో తన పాత్ర కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చారు. విజయమ్మ ప్రసంగం సైతం ప్లీనరీ వేదికగా ఖరారు చేసారు. తన ప్రసంగంలో తన పైన రాజకీయంగా వస్తున్న విమర్శలు..జరగుతున్న చర్చలకు సమాధానం ఇస్తారని తెలుస్తోంది.
ఇడుపులపాయ టు పార్టీ ప్లీనరీ
వైఎస్సార్ జయంతి కావటంతో గురువారం సాయంత్రమే సీఎం జగన్ తో సహా విజయమ్మ - షర్మిల- కటుంబ సభ్యులు ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ ఉదయం అందరూ కలిసి ఒకే సమయంలో వైఎస్సార్ కు నివాళి అర్పించారు, ప్రార్దనల్లో పాల్గొన్నారు. ఆ తరువాత షర్మిల తన కుమార్తె - కుమారుడుతో కలిసి వెళ్లిపోగా.. విజయమ్మ - జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం బయల్దేరారు. సీఎం ప్రారంభోపన్యాసంలో ఈ రెండు రోజుల సమావేశాల లక్ష్యం ఏంటనేది స్పష్టం చేయనున్నారు. ఇక, రెండో రోజు ముగింపు ప్రసంగంలో వచ్చే ఎన్నికలు.. పార్టీ కమిటీలు.. శ్రేణులకు దిశా నిర్దేశం పైన జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. అటు ఇడుపుల పాయలో సోదరితో కలిసి తండ్రికి నివాళి..ఇటు పార్టీ ప్లీనరీ వేదికపైన కుమారుడు జగన్ తో కలిసి తల్లి వేదిక పంచుకోవటం ద్వారా ఇప్పుడు ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి.