YS Viveka murder case: గుండెపోటా..గొడ్డలిపోటా: బందిపోటుకు తెలుసు: బుద్ధా వెంకన్న
లోక్సభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి వైెఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో అసలు దోషులను కేంద్రీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిది గుండెపోటా.. గొడ్డలిపోటా అనేది స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర బందిపోటుగా.. ఏ2గా గుర్తింపు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి నిందితులు ఎవరో తెలుసునని అన్నారు.
YS Sharmila: ఈ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష వేదిక ఫిక్స్: ఆ జిల్లాకు
ఈ ఉదయం ఆయన గుంటూరులో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రను పీల్చి పిప్పి చేస్తోన్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రుల కంటే విజయసాయి రెడ్డి బందిపోటుగా మారిపోయారని ధ్వజమెత్తారు. వైఎస్ వివేకా హత్యోదంతంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు పులివెందులలో పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తోందని గుర్తు చేశారు. ఇక విజయసాయి రెడ్డిని కూడా విచారించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకా మరణవార్త తెలిసిన వెంటనే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా సంఘటనా స్థలానికి వెళ్లిన వ్యక్తి విజయసాయి రెడ్డేనని చెప్పారు. వివేకా గుండెపోటు వల్ల మరణించినట్లు మీడియాకు చెప్పారని గుర్తు చేశారు. విజయసాయి రెడ్డి ఆగమేఘాల మీద పులివెందులకు వెళ్లి గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని బుద్ధా వెంకన్న నిలదీశారు. వివేకా మృతదేహం మీద గొడ్డలితో నరికిన గుర్తులు ఉన్నప్పటికీ.. గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పడం వెనుక అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. అలా విజయసాయి రెడ్డి ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మొదట్లో గుండెపోటుగా.. రెండోరోజు హత్యగా, మూడోరోజు చంద్రబాబే దీనికి కారణమంటూ ప్రకటనలు ఇచ్చిన విజయసాయి రెడ్డి ఇప్పటిదాకా వైఎస్ వివేకా హత్య గురించి మాట్లాడలేదని చెప్పారు. సీబీఐ అధికారులు పులివెందులలో విచారణ చేపట్టిన ప్రతీసారీ తాను రాజ్యసభ సభ్యుడినంటూ సాయిరెడ్డి ఢిల్లీలో వెళ్లి కూర్చుంటున్నారని అన్నారు. ఈ పరిణామాలన్నీ అనేక అనుమానాలు కలిగిస్తోన్నాయని, వివేకా హత్యకేసు నిందితులు ఎవరనేది విజయసాయి రెడ్డికి తెలుసునని బుద్ధా వెంకన్న ఆరోపించారు. సాక్షాత్తూ వివేకా కుమార్తె సైతం కుటుంబ సభ్యుల మీదే అనుమానాలను వ్యక్తం చేశారని చెప్పారు.
రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఉత్తరాంధ్ర ప్రాంత ఇన్ఛార్జీగా వేల కోట్ల రూపాయలను దోచుకుంటోన్నాడని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ అమాయకత్వంతో ఆడుకుంటోన్న విజయసాయి రెడ్డిపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. విజయసాయి రెడ్డి చేసే ప్రతి అక్రమ పనిలోనూ ప్రభుత్వ ప్రమేయం ఉందనే విషయం ఇక్కడ స్పష్టమౌతోందని అన్నారు. ఆయన అక్రమాల మీద ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులపై అక్రమ కేసులు బనాయించి, నోరు మూయిస్తోన్నారని ఆరోపించారు. అందుకే- ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సీబీఐ అధికారులు విజయసాయి రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.