కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
ఏపీలో ఎన్నికల వేళ చర్చనీయాంశమవుతున్న అంశాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఒకటి. ముఖ్యంగా కడప లోక్ సభ స్ధానంలో మరోసారి పోటీ చేస్తున్న వివేకా కేసు నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ కేసు ఇబ్బందికరంగా మారింది. అవినాష్ కు పోటీగా బరిలోకి దిగిన వైఎస్ షర్మిల, ఆమె మద్దతిస్తున్న సోదరి, వివేకా కుమార్తె సునీత చేస్తున్న వ్యాఖ్యలతో అవినాష్ కు సమస్యలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కడప కోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలు దీనిపై వీరితో పాటు విపక్ష నేతలెవరూ మాట్లాడకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
వివేకా కేసుపై సునీత, షర్మిలతో పాటు చంద్రబాబు, లోకేష్, పవన్, పురందేశ్వరి ఇలా ఎవరూ మాట్లాడకుండా కడప కోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలతో అవినాష్ రెడ్డితో పాటు వైసీపీకీ ఊరట లభించింది. అయితే కడప కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసేందుకు సునీత సిద్దమవుతున్నారు. ఈ మేరకు ఇవాళ పులివెందులో చేపట్టిన ఇంటింటి ప్రచారంలో సునీత ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ఆమె తెలిపారు.

మరోవైపు తాను హైకోర్టుకు వెళతానని తెలిసి పులివెందుల నియోజకవర్గంలో తమకు సాయం చేసే వారిని వైసీపీ నేేతలు బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు. కడప కోర్టులో ప్రతివాదుల వాదన కూడా వినకుండా మధ్యంతర ఆదేశాలు తెచ్చుకుని వైసీపీ నేతలు రూల్స్ మాట్లాడుతున్నారని సునీత విమర్శించారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులకు ఓటు వేయవద్దని పులివెందుల ప్రజలను సునీత కోరారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు ఓటువేసి పార్లమెంటుకు పంపాలని కోరారు.












Click it and Unblock the Notifications