మరింత భద్రత కోరిన దస్తగిరి-అవినాష్ తాజా కామెంట్స్ తో...!
ఏపీలో వివేకా హత్య కేసు రేపుతున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు సీబీఐ ఈ కేసులో దర్యాప్తు వేగం పెంచింది. మరోవైపు నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని వరుసగా ప్రశ్నిస్తోంది. అదే సమయంలో విచారణలో వారు చేస్తున్న ఆరోపణలతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియడం లేదు. ఇలాంటి సమయంలో ఈ కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరిపై అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తమను సీబీఐ నిందితులుగా మార్చడాన్ని తప్పుబడుతూ అవినాష్ రెడ్డి తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను వాంగ్మూలం ఇచ్చినప్పుడే అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఇప్పుడు విమర్శలు చేయడమేంటని నిన్న ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ దస్తగిరి పోలీసుల్ని ఆశ్రయించారు.

ఇవాళ కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దస్తగిరి.. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ, సీబీఐ ఎస్పీలకు దస్తగిరి ఈ మేరకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనకు భద్రత మరింత పెంచాలని దస్తగిరి కోరారు. తాజాగా అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత తనకు ప్రాణహాని పెరిగిందన్నారు. పులివెందులలో అవినాష్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ముప్పుపొంచి ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో దస్తగిరి ఆరోపించారు.

మరోవైపు ఇప్పటికే వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉంటూ అప్రూవర్ గా మారి హత్యకు సంబంధించిన అన్ని వివరాలు బయటపెట్టిన దస్తగిరికి సీబీఐ భద్రత కల్పించింది. ఈ భద్రతలో ఉంటూనే దస్తగిరి అవినాష్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు. హత్యలో ఆయనతో పాటు భాస్కర్ రెడ్డి, ఇతర నిందితుల పాత్రపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయనకు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications