చంద్రబాబు ఎఫెక్ట్: వైయస్ జగన్ బిసి కార్డు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో బిసిలకు తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దీంతో తాను ఏం తక్కువ కాదని చెప్పేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి తమ పార్టీ తరపున బిసినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు, సీమాంద్ర ప్రాంతంలో బిసిలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తానని హామీలతో ముందు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా బిసిలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో ఉండటమే గాక, తన ఆలోచనలను అమలు చేస్తున్నారు. బిసి నాయకులను జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా, జనరల్ కేటగిరి స్థానాల్లోనూ బిసిలను నియమించనున్నట్లు ప్రకటిస్తున్నారు.
సీమాంధ్రలో మున్సిపల్ మేయర్ పదవులు, ఎంపి, ఎమ్మెల్యే స్థానాలు అత్యధికంగా బిసిలకు కేటాయించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా, చిత్తూరు(జనరల్, మహిళ), తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రకాశం, నెల్లూరు(జనరల్) జిల్లాల్లో అత్యధిక స్థానాలను బిసిలకే కేటాయించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే బిసి వర్గానికి చెందిన వైయస్సార్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎన్ బాలాజీని ప్రకాశం జిల్లా జడ్పి ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. శ్రీకాకుళం జడ్పి ఛైర్ పర్సన్ పదవికి బిసి వర్గానికి చెందిన పి. భార్గవిని తమ పార్టీ అభ్యర్థిగా వైయస్సార్ పార్టీ ప్రకటించింది. పలాస నుంచి ఆమె జడ్పిటిసి పదవికి నామినేషన్ వేశారు. బి. నాగసుభాషిణిని విశాఖపట్నం జడ్పి ఛైర్ పర్సన్ పదవికి తమ పార్టీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
బిసికి రిజర్వు అయిన అనంతపురం జడ్పి ఛైర్ పర్సన్ పదవికి పెనుగొండ నుంచి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన మంగమ్మను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కర్నూలు జిల్లా జడ్పి ఛైర్మన్ పదవికి బోయ కమ్యూనిటీకి చెందిన డాక్టర్ మధును ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. నెల్లూరు జడ్పి ఛైర్మన్ పదవి జనరల్ కెటగిరీకి రిజర్వు కావడంతో ఆ పదవికి బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని జడ్పి ఛైర్మన్ పదవికి తమ పార్టీ అభ్యర్థిగా జగన్ నామినేట్ చేశారు.
కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవికి తాతినేని పద్మావతిని, కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవికి ప్రసాద్ను తమ పార్టీ అభ్యర్థులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదే విధంగా ఎంపి స్థానాలకు కూడా బిసి వర్గానికి చెందిన వారిని ప్రకటించింది. కర్నూలు ఎంపి స్థానానికి బుట్టా రేణుకను తమ పార్టీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. హిందూపురం, అనంతపురం ఎంపి స్థానాలకు బిసిలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సీమాంధ్రలోని పలు అసెంబ్లీ స్థానాలను బిసిలకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.