పడగ విప్పిన ఫాక్షన్: జగన్ పార్టీ నేత దారుణ హత్య
కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పలుకూరులో రామకృష్ణాపురం మాజీ సర్పంచ్, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ప్రభాకర్ నాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాపరాళ్ల గనుల దగ్గర ప్రభాకర్ను ట్రాకర్తో ఢీకొట్టించిన ప్రత్యర్ధులు ఆపై వేటకొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆస్తితగాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జిల్లాలోని తలకూరు మైనింగ్ గనుల వద్ద ప్రభాకర్ నాయకుడు తన అనుచరుడు భాస్కర్తో కలిసి వెళ్తుండగా ఈ దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత నిందితులు పరారయ్యారు. ఈ దాడిలో ప్రభాకర నాయుడు అక్కడికక్కడే మరణించారు.
దాడిలో గాయపడిన భాస్కర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని భాస్కర్ను ఆస్పత్రికి తరలించారు. తమపై టిడిపి నేతలే దాడి చేశారని భాస్కర్ ఆరోపించారు. ప్రభాకర్ నాయుడు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తప్పిన రైలు ప్రమాదం
కాకినాడ-ముంబై ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం ములగపల్లి దగ్గర రైలు పట్టా విరిగింది. ట్రైన్ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టారు.
కూలిన హెలికాప్టర్
విశాఖ పట్నం జిల్లా కొయ్యూరు మండలం, డౌనూరు సమీపంలో ఓ హెలీకాఫ్టర్ కూలినట్లు సమాచారం. అయితే ఏ విధమైన, ఏ సంస్థకు చెందిన హెలీకాఫ్టర్ అన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై కొయ్యూరు సీఐకు సమాచారం వచ్చిందని, ఎక్కడ కూలిందో తెలియదని, దర్యాప్తు చేపట్టామని సిఐ చెప్పినట్లుగా తెలియవచ్చింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.