లోటస్పాండ్ ఖాళీ!: 'మారకుంటే' కష్టమే.. ఏపీ దారి పట్టనున్న జగన్
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీకి తరలిపోనుంది. తెలంగాణలో వైసిపి దాదాపు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు అందరు కూడా అధికార తెరాసలో చేరారు.
ఈ నేపథ్యంలో ఆ పార్టీకి తెలంగాణలో ప్రజాప్రతినిధులు లేరు. కొందరు నేతలు మాత్రం ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి పోయేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. వైసిపి కేంద్ర కార్యాలయం ప్రస్తుతం హైదరాబాదులోని లోటస్ పాండులో ఉంది.
దీనని మంగళగిరి లేదా విజయవాడకు తరలించాలని జగన్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఇక నుంచి రాజకీయ, పార్టీ కార్యకలాపాలన్నీ కూడా ఏపీ నుంచే నిర్వహించాలని జగన్ దాదాపు నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన సమయంలో జూబ్లీహిల్స్లోని అతి పెద్ద భవవాన్ని పార్టీ కార్యాలయంగా అద్దెకు తీసుకున్నారు. ఏపీలో వైసిపి అధికారంలోకి వస్తుందనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ కళకళలాడింది. కానీ ఏపీలో అధికారంలోకి రాలేదు.
పైగా రాష్ట్ర విభజన జరిగింది. పార్టీ కార్యాలయం తెలంగాణలో ఉంది. అయితే, ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల శాఖల కార్యకలాపాలు ఇక్కడి నుంచే నడిచేవి. కానీ ఏపీలో వైసిపి కీలకంగా ఉంది. దీంతో, జూబ్లీహిల్స్ కార్యాలయంలో కార్యకలాపాలు చాలా వరకు తగ్గిపోయాయి.
తాజాగా, వైసిపి తెలంగాణలో పూర్తిగా ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచే వైసిపి పార్టీ, రాజకీయ కార్యకలాపాలు నడిపించాలని చూస్తున్నారు. ఇప్పటికే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ, పాలనాపరమైన వ్యవహారాలను దాదాపు ఏపీ నుంచి నడిపిస్తున్నారు.
ప్రభుత్వం, పాలక పార్టీ కార్యకలాపాలు అన్ని విజయవాడ కేంద్రంగా నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతిపక్షం హైదరాబాద్ కేంద్రంగా నడిస్తే నష్టమని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఏపీ నూతన రాజధాని చెంతనే పార్టీ కొత్త కార్యాలయం పెట్టుకోవాలని భావిస్తున్నారు. అదే జరిగితే ఇక ఎంతో పెద్దది అయిన లోటస్ పాండు ఆయన కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుందేమో.












Click it and Unblock the Notifications