టీఆర్ఎస్ వైపు జగన్ ఎమ్మెల్యేలు, డుమ్మా లిస్ట్లో రోజా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి బీటలు వారుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఖమ్మం జిల్లాలో మాత్రమే ఆ పార్టీ ఖమ్మం పార్లమెంటుతోపాటు మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ముగ్గురిలో ఒకరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభాపక్ష నేతగానూ, మరొకరు ఉపనేతగాను, మరొకరు విప్గాను ఉన్నారు. ఇక ఎంపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు.
కాగా, ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం పార్టీ నేతల్లో రోజురోజుకీ సన్నగిల్లుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రధాన కార్యక్రమాలను చేపట్టకపోవటంతో పార్టీలోని నేతలంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లుగా కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలోని కొందరు నేతలు కాంగ్రెస్లో చేరగా, మరికొందరు తెరాస వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే తెరాస నాయకత్వంతో సంప్రదింపులు జరిపి, పార్టీలో చేరికపై ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు ఒకరిద్దరు ఎంపిపిలు, జడ్పీటిసిలు, పది మందికిపైగా సర్పంచ్లు కూడా తెరాసలో చేరనున్నారట.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఒకరు పార్టీ మారితే అనర్హత వేటు పడదని, కాబట్టి పార్టీలో చేరవచ్చని తెరాస నేతలు సూచించినట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని, అప్పుడు పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరతారని తెరాస నేతలు చెబుతున్నారు.
ఫిరాయింపుల చట్టానికి భయపడి..
సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆదివారం చర్చించిన విషయం తెలిసిందే. చర్చించారు. సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన వైసీపీఎల్పీ సమావేశం పార్టీ శానససభ్యులు హాజరు కాకపోవడంతో జగన్ వారి కోసం ఎదురుచూసి 2 గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఈ సమావేశానికి గైర్హాజరైన వారి పైన పలు రూమర్లు వినిపిస్తున్నాయి.
27 మంది హాజరు కాలేదని.. 20 మంది హాజరు కాలేదని చెబుతున్నారు. పార్టీ మాత్రం 17 మంది వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదని చెబుతోంది. గైర్హాజరు పైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హాజరు కాని వారిలో రోజా, కొడాలి నాని, జలీల్ ఖాన్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు తదితరులు కూడా ఉన్నారు. అయితే వీరు వ్యక్తిగత కారణాల వల్లనే హాజరు కాలేదని సమాచారం. మరో వాదన కూడా ఉంది. పార్టీ పైన అసంతృప్తితో ఉన్న ఇంకొందరు పార్టీ ఫిరాయింపుల చట్టానికి భయపడి ఏం తేల్చుకోలేకపోతున్నారంటున్నారు.