వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన: రెడ్డి..కమ్మ..కాపు వర్గాలకు రెండు చొప్పున : 11 మంది లిస్టు ఇదే...!!
ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ అధికార వైసీపీ పూర్తి చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసిన వైసీపీ..ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో 11 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఈ మొత్తం 14 స్థానాలకు వైసీపీ తొలి నుంచి అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలనే ఫాలో అయ్యారు. అందులో భాగంగా ఏడు స్థానాలను బీసీ-ఎస్సీ-మైనార్టీ వర్గాలకు ఖరారు చేసారు. మిగిలిన ఏడు స్థానాలను ఓసీలకు కేటాయించారు. స్థానిక సంస్థల కోటాలో ఈ సారి రెండు స్థానాలు కమ్మ వర్గానికి కేటాయించటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం.
11 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటన
అదే విధంగా రెండు స్ఠానాలు కాపు.. మరో రెండు స్థానాలు రెడ్డి వర్గానికి కేటాయిస్తూ ప్రకటన చేసారు. ఇక, మొత్తం 8 జిల్లాల్లోని 11 స్థానాలకు అభ్యర్ధుల వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల వెల్లడించారు. విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు పేరు ప్రకటించారు. ఆయన క్షత్రియ వర్గానికి చెందిన వారు. విశాఖలో రెండు స్థానాల్లో బీసీ అభ్యర్ధులను ఖరారు చేసారు. వరుదు కళ్యాణి (కొప్పుల వెలమ- బీసీ), వంశీక్రిష్ణ (యాదవ-బీసీ) కి ఖరారు చేస్తూ పేర్లు ప్రకటించారు. తూర్పు గోదావరి నుంచి అనంత ఉదయ భాస్కర్ పేరును ఖరారు చేసినట్లు తెలిపారు.
తలశిల రఘురాం పేరు అధికారిక ప్రకటన
ఇక, ముఖ్యమంత్రి జగన్ కు పార్టీ పెట్టిన సమయం నుంచి వెంటనే ఉంటూ...పాదయాత్ర నుంచి ఇప్పటి వరకూ ప్రతీ కార్యక్రమం రూపకల్పనలో కీలక భూమిక పోషించిన సీఎం సలహాదారుగా ఉన్న తలశిల రఘురాం కు ఎమ్మెల్సీగా ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించారు. క్రిష్ణా జిల్లాలో రెండు స్థానాలు ఉండగా, ఒకటి కమ్మ వర్గానికి చెందిన తలశిల రఘురాంకు కేటాయించారు. రెండో స్థానం ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన మొండితోక అరుణ్ కుమార్ పేరును సీఎం ఎంపిక చేసారు. ఇక, గుంటూరు జిల్లా నుంచి కాపు వర్గానికి చెందిన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు పేరు ప్రకటించారు.
మర్రి రాజశేఖర్ కు ఈ సారి లేదు
ఇదే జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ కు ఈ సారైనా దక్కుతుందని అంచనా వేసినాద..క్రిష్ణా - ప్రకాశం జిల్లాల నుంచి కమ్మ వర్గానికి అవకాశం ఇవ్వటంతో మర్రి రాజశేఖర్ పేరును పక్కన పెట్టారు. ఇక్కడ రెండో సీటు నుంచి బీసీ వర్గాల నుంచి చేనేత కమ్యూనిటీకి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంత రావు పేరు చివరి నిమషంలో ఎంపిక చేసారు. ఇక, ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు ఇన్ ఛార్జ్ గా ఉన్న తూమాటి మాధవరావు పేరు ప్రకటించారు. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం ఇన్ ఛార్జ్ గా ఉన్న బీసీ వర్గానికి చెందిన క్రిష్ణ రాఘవ జయేంద్ర భరత్ ను ఎంపిక చేసారు.
Recommended Video
కుప్పం ఇన్ ఛార్జ్ కు ఎమ్మెల్సీ పదవి
అనంతపురం జిల్లా నుంచి మాజీ విప్ రెడ్డి వర్గానికి చెందిన వై శివరామి రెడ్డి పేరును ప్రకటించారు. అవకాశం రాని వారికి వచ్చే సారి అవకాశం దక్కుతుందని సజ్జల చెప్పుకొచ్చారు. ఈ నెల 16వ తేదీ తరువాత వీరంతా నామినేషన్లు వేస్తారని వెల్లడించారు. ఇక, ఈ 14 స్థానాలు వైసీపీ ఖాతాలో జమ కావటం ద్వారా ఇక, శాసన మండలిలో వైసీపీ బలం 32 కు చేరనుంది. అందులో 18 మంది ఎస్సీ - బీసీ - మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉంటారు. అందులో నలుగురు మైనార్టీలు. శాసన మండలిలో తొలి సారి నలుగురు సభ్యులు ఒకే పార్టీ నుంచి ఉండటం రికార్డుగా పార్టీ నేతలు చెబుతున్నారు.