బాబుపై చీటింగ్ కేసులు: పెద్దిరెడ్డి, 'మోసం చేసిన చిరంజీవిని ఎలా కలుస్తారు'
తిరుపతి: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడులో ఆ పార్టీ నేతలంతా తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేశారని వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదివారం ఎద్దేవా చేశారు. జగన్ అంటే చంద్రబాబుకు భయం అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని, దీనిని నిరసిస్తూ జూన్ 2న రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు పైన రాష్ట్రవ్యాప్తంగా చీటింగ్ కేసులు పెడతామని చెప్పారు.
మోడీ నా వెనుక ఉన్నారని అంటారేమో: ముద్రగడ
టిడిపి పైన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. దాసరి నారాయణరావు, చిరంజీవి, నేతలు రఘువీరారెడ్డి, సీ రామచంద్రయ్య, శైలజానాథ్, పళ్లంరాజు, బొత్స సత్యనారాయణలను తాను కలిశానని, కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరానని చెప్పారు.
తమ ఉద్యమానికి నేతల మద్దతు కోరుతుంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారనడం సరికాదన్నారు. మొన్న జగన్, నేడు కాంగ్రెస్ పార్టీ నేతలు తన వెనుక ఉన్నారని చెబుతున్న టీడీపీ నేతలు రేపు ప్రధాని మోడీ కూడా తన వెనుకే ఉన్నారని అంటారని విమర్శించారు. ఆగస్టులోగా కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
జగన్కు కోవర్టు
ముద్రగడ పద్మనాభం చర్యలతో కాపులు అయోమయంలో ఉన్నారని ఏపీ కాపు కార్పోరేషన్ అధ్యక్షులు రామానుజులు అన్నారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ముద్రగడకు లేదన్నారు. చంద్రబాబుకు సహాయ సహకారాలు అందించాల్సిన ముద్రగడ.. జగన్కు కోవర్టుగా మారడం మంచిది కాదన్నారు.
కాపు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనిని గ్రహించకుండా గతంలో కాపులకు అన్యాయం చేసిన వారిని కలిసి మద్దతు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన చిరంజీవిని, దాసరిని, రఘువీరా తదితరులను కలిశారు. ఈ నేపథ్యంలో గతంలో కాపులను మోసం చేసిన చిరులాంటి వారిని కలవడం ఏమిటని ఇప్పటికే టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.