కుప్పంలో కూర్చుని శాపనార్థాలు పెడితే కుదరదు నాయుడు గారూ..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఉద్రిక్తతల మధ్య ముగిసింది. మూడు రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. పార్టీ నాయకులను కలుసుకున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించడానికి ఉద్దేశించిన జీవో నంబర్ 1ని తీవ్రంగా తప్పుపట్టారు.
ఏపీ హైకోర్టుకు సెలవులు: తేదీలు ఇవే- అత్యవసర విచారణకు జస్టిస్ బట్టు దేవానంద్ బెంచ్..!!
విమర్శలు కంటిన్యూ..
చంద్రబాబు కుప్పం పర్యటనపై అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు కొనసాగుతూనే వస్తోన్నాయి. కుప్పంలో చంద్రబాబు చేసిన విమర్శలు, ఆరోపణలను మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు తిప్పికొడుతున్నారు. జీవో నంబర్ 1ని ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చిందనే విషయాన్ని క్షుణ్నంగా వివరించే ప్రయత్నం చేస్తోన్నారు. కందుకూరు, గుంటూరు సభల్లో 11 మంది మరణించడం వల్లే ఈ జీవో అవసరం ఏర్పడిందని పునరుద్ఘాటిస్తోన్నారు.
కుప్పం నుంచే గెలుద్దామంటే ఎలా..
తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందంటూ చంద్రబాబు చేసిన విమర్శలను తిప్పికొట్టారాయన. అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో అమలులో ఉంటే వీధిపోరాటాలకు వీలుంటుందా అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. ఆ పరిస్థితి లేదు కాబట్టే చంద్రబాబు కుప్పంలో పర్యటించగలుగుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రం మొత్తాన్నీ కుప్పం నుంచే గెలవాలని భావిస్తున్నారని, అది సాధ్యం అయ్యే పని కాదని పేర్కొన్నారు.
ఫెయిల్డ్ సీఎం ఎలా..
ఫెయిల్డ్ సీఎం' అంటూ వైఎస్ జగన్ ను చంద్రబాబు విమర్శించడాన్ని విజయసాయి రెడ్డి తప్పుపట్టారు. ఏఏ రంగాల్లో తమ ప్రభుత్వం విఫలమైందో విడమరిచి ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. నిరాధారమైన నిందలేస్తూ పసలేని ఆరోపణలు చేస్తూ ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందు వల్ల తాను ప్రభుత్వంపై ఎంత అడ్డగోలు విమర్శలకు తెగబడినా.. ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా ఆయనలో కనిపిస్తోందని మండిపడ్డారు.
కార్యకర్తలను రెచ్చగొడుతూ..
45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు- ముఖ్యమంత్రి దాడి చేయాలంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, కుప్పంలో కూర్చుని తన విష ప్రచారంతో రాష్ట్రంలోని 174 నియోజవర్గాల ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఒక నిబద్ధత గల రాజకీయవేత్తగా వ్యవహరించాల్సిన చంద్రబాబు నాయుడు ఇలా రెచ్చిపోయి మాట్లాడడం దేనికి సంకేతమని నిలదీశారు. ఆయనను ఓటమి భయం వెంటాడుతోందా? లేక ఎలాగైనా సరే 2024 ఎన్నికల్లో గెలవ గలనని కలలు కంటున్నారా? అని ప్రశ్నించారు.
తండ్రి బాటలో..
ప్రజల సంక్షేమం విషయంలో వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్నారని, ప్రజాదరణను పెంచుకుంటున్నారని సాయిరెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా వాటిని విజయవంతంగా అధిగమిస్తోన్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ నగదు బదిలీ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు సైతం అధ్యయనం చేస్తోన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు కుప్పంలో కూర్చుని శాపనార్ధాలు పెడుతున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.