క్షత్రియుల్లో రఘురామ అరెస్టు చిచ్చు- వైసీపీ ఎమ్మెల్యేల సమర్ధన-క్షత్రియ సంఘం వార్నింగ్
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ అరెస్టు చేయడం క్షత్రియ సామాజిక వర్గంలో చిచ్చు రేపింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను విమర్శిస్తున్నారన్న కారణంతో రఘురామను సీఐడీ అరెస్టు చేయడాన్ని ఆ సామాజిక వర్గానికి చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి సమర్ధించుకోగా.. క్షత్రియ సంఘం నేతలు మాత్రం మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న క్షత్రియ సంఘం తీరు మార్చుకోవాలని సర్కారుకు హెచ్చరికలు పంపుతోంది.

క్షత్రియుల్లో రఘురామ అరెస్టు చిచ్చు
క్షత్రియ సామాజికవర్గంలో బాగా పట్టున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ ప్రభుత్వం సీఐడీ సాయంతో అరెస్టు చేయించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సీఐడీ అరెస్టు చేసిన విధానంపై క్షత్రియ సామాజికవర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఓ ఎంపీ స్ధాయిలో ఉన్న వ్యక్తితో సీఐడీ ప్రవర్తించిన తీరుపై క్షత్రియ నేతలు మండిపడుతున్నారు. అయితే ప్రభుత్వంలో భాగంగా ఉన్న క్షత్రియ ఎమ్మెల్యేలు, అదే సామాజిక వర్గానికి చెందిన కేబినెట్ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు మాత్రం రఘురామ అరెస్టు సరైన చర్యేనని సమర్దిస్తున్నారు.

మంత్రి చెరుకువాడ సమర్ధన
రఘురామకృష్ణంరాజు అరెస్టును వైసీపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమర్ధించారు. ఢిల్లీలో 14 నెలలు కూర్చుని తనను గెలిపించిన ప్రజల్ని రఘురామరాజు గాలికొదిలేశారని, వారి బాగోగులు పట్టించుకోలేదన్నారు. ఆయన అరెస్టు సరికాదంటున్న విపక్షాల తీరు సరికాదని రంగనాథరాజు తెలిపారు. అసలు విపక్షాలకు రఘురామరాజుపై ఎందుకంత శ్రద్ద అని మంత్రి ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చీడపురుగుని ఎంపీగా ఎన్నుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని రంగనాథరాజు అన్నారు. ప్రజల మనోభావాలు అవసరం లేని రఘురామరాజుకు గుణపాఠం అవసరమన్నారు. ఆయన విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

రఘురామపై వైసీపీ ఎమ్మెల్యేల ఫైర్
రఘురామ అరెస్టును నరసాపురం పరిధిలోకి వచ్చే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సమర్ధించారు. ఇప్పటికే ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందని, ప్రభుత్వం ఉపేక్షించిందని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు అన్నారు. కొన్ని వర్గాలపై విద్వేష వ్యాఖ్యలతో ప్రభుత్వంపై అసంతృప్తి పెంచాలనేది ఆయన ఉద్దేశమని ప్రసాదరాజు తెలిపారు. ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారని మండిపడ్డారు. రఘురామరాజు అరెస్టు సరైన నిర్ణయమని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. పిచ్చికుక్కలా రోజూ రచ్చబండల మాట్లాడుతున్న వ్యక్తికి తగిన శాస్తి జరిగిందన్నారు. జిల్లా అభివృద్ధికి క్షత్రియుల్లో ఎంతోమంది మహనీయులు కృషిచేస్తే, క్షత్రియ సామాజిక వర్గానికి రఘురామ అపకీర్తి తెచ్చారని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.
చంద్రబాబు డైరెక్టన్లోనే రఘురామరాజు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలున్నాయన్నారు.
Recommended Video

జగన్ పగబట్టారంటూ క్షత్రియ సంఘం ఫైర్
రఘురామకృష్ణంరాజు అరెస్టుపై రాష్ట్ర క్షత్రియ సంఘం మండిపడింది. రఘురామరాజు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని క్షత్రియ సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు తెలిపారు. కక్షసాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్టు చేశారన్నారు. వారెంట్ లేకుండా ఓ ఎంపీని ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా అని అడిగారు. ఈ అక్రమ అరెస్టులపై పెట్టే శ్రద్ధ కరోనాపై పెడితే ప్రజల ప్రాణాలు కాపాడొచ్చు కదా అని గొట్టుముక్కల ప్రభుత్వానికి హితవు పలికారు. బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసినందుకు జగన్ పగబట్టి అక్రమ అరెస్ట్ చేయించారని విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని గొట్టుముక్కల ఆరోపించారు. తన కేసుల విచారణకు ప్రతీ శుక్రవారం కోర్టుకు రమ్మంటున్నారనే కక్షతో ప్రతీ శుక్రవారం ఓ అక్రమ అరెస్టు చేస్తున్నారా అని జగన్ను ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమ కేసులకు కోర్టులు త్వరలో మొట్టికాయలు వేయడం ఖాయమన్నారు. తక్షణం రఘురామపై అక్రమ కేసుల్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా క్షత్రియుల ఆగ్రహానికి వైసీపీ సర్కారు గురికాక తప్పదన్నారు.












Click it and Unblock the Notifications