జగన్ టూర్ కు 10 వేల మంది..? పోలీసులకు షాక్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన అంటేనే పోలీసులు హడలెత్తిపోతున్నారు. జగన్ పర్యటనలకు అనుమతులు ఇవ్వడం దగ్గరి నుంచి, ఆ టూర్ ప్రారంభమై ముగిసే వరకూ బందోబస్తు ఏర్పాటు చేయడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడం పోలీసులకు సమస్యగా మారుతోంది. విపక్ష నేత కాకపోయినా మాజీ ముఖ్యమంత్రి కావడం, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాజకీయ నేత కావడంతో జగన్ విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పట్లేదు.
ఈ నేపథ్యంలో జగన్ తాజాగా ప్లాన్ చేసిన చిత్తూరు టూర్ అక్కడి పోలీసులకు ముందే షాకులిస్తోంది. జగన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ కు వెళ్లి అక్కడ తోతాపురి మామిడి రైతుల్ని పరామర్శించాల్సి ఉంది. తోతాపురి మామిడికి ధర తగ్గినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతుల్ని జగన్ కలుసుకుని భరోసా ఇచ్చేందుకు ఈ టూర్ ఏర్పాటు చేశారు. ఈ టూర్ కు అనుమతి ఇచ్చే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి కారణం జగన్ టూర్ కు వైసీపీ పోలీసులకు ఇస్తున్న షాకులే.

జగన్ చిత్తూరు టూర్ లో 10 వేల మంది వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు అనుమతులు ఇచ్చి భద్రత కల్పించాలని వైసీపీ నేతలు పోలీసుల్ని కోరుతున్నారు. దీంతో పోలీసులు అంత మందిని ఈ టూర్ కు అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. ఇంత భారీ సంఖ్యలో ఎన్నికల ప్రచారం తరహాలో జనాన్ని అనుమతిస్తే వారిని నియంత్రించడం కష్టంగా మారుతుంది.
అందుకే జనాన్ని కొంత తగ్గించుకుని వస్తే ఇబ్బంది లేదని పోలీసులు వైసీపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గేలా లేరు. దీంతోపాటు జగన్ హెలికాఫ్టర్ దిగేందుకు హెలిప్యాడ్ విషయంలోనూ వైసీపీ నేతలు ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. టూర్ కు సమయం తక్కువగా ఉండటంతో పోలీసుల్లో టెన్షన్ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications