Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి బంపర్ ఆఫర్.. ! క్యాబినెట్ ర్యాంక్ కల్పించే ఛాన్స్?
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమెను తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతికి క్యాబినెట్ హోాదా కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీపార్వతి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమెకు క్యాబినెట్ మంత్రికి సమానంగా సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లక్ష్మీపార్వతి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అవకాశం ఉన్న ప్రతీసారీ ఆమె మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వైఖరిపై నిప్పులు చెరుగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా డిబేట్లలో పాల్గొనే వారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గంలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచీ కొనసాగుతున్నారు. పార్టీలో కొన్ని పదవులను నిర్వహించారు.
అధికారంలోకి వచ్చిన తరువాత కూడా లక్ష్మీపార్వతి పెద్దగా పదవులను ఆశించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ.. పార్టీకి ఆమె చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యత గల పోస్టును కేటాయించినట్లు అభిప్రాయపడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని లక్ష్మీపార్వతికి క్యాబినెట్ హోదా కూడా కల్పించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు పార్టీ నాయకులు. ఇదిలావుండగా..లక్ష్మీపార్వతికి ప్రాధాన్యత గల హోదాను కల్పించడం వల్ల రాజకీయంగా కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకుల విమర్శలకు చెక్ పెట్టినట్టవుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుటుంబానికి ప్రభుత్వంలో ప్రాతినిథ్యం కల్పించినట్టయిందనే చెబుతున్నారు వైఎస్సార్సీపీ నాయకులు. లక్ష్మీపార్వతికి ప్రాధాన్యత గల పోస్టును కేటాయించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు.