వైసీపీ నాయకుడి హత్య.. వైరల్ గా 'మర్డర్ ప్లాన్'!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి నేత హత్యకు నిందితులు వేసిన ప్రణాళిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూపురం నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి ఈనెల 8వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆరోజు రామకృష్ణారెడ్డి ఎవరెవరిపై అనుమానం వ్యక్తం చేశారో వారందరి విషయాలు, వారు హత్యకు వేసిన ప్రణాళిక ఆ ఆడియోలో ఉన్నాయి.
కేసులో ప్రధాన నిందితుడిగా మంజునాథ్ అలియాస్ వరుణ్ ఉన్నారు. ఆయన మరో నిందితుడు మహేష్ తో మట్లాడిన మాటలు, అలాగే మరో ఆడియోలో వరుణ్, మూర్తి అనే వ్యక్తితో మాట్లాడటం, మధ్యలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణతో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడటంలాంటి విషయాలన్నీ ఉన్నాయి.
రామకృష్ణారెడ్డిని ఏం చేసినా ఏమీ కాదని, పోలీసులు ఏమీ చేయరని, సీఐ తనతో రోజూ మాట్లాడుతున్నారని వరుణ్ మహేష్ కు వివరించినట్లు ఆ ఆడియోలో నమోదైంది. ఎమ్మెల్సీ పీఏ రామకృష్ణారెడ్డిని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఊరుకున్నారని, మనమైతే పని పూర్తిచేయగలమని తెలుసుకొని నాగన్నద్వారా సంప్రదించారనే విషయంపై నిందితులు మాట్లాడుకున్నారు.
అలాగే మరో ఆడియోలో వరుణ్ తో మూర్తి అనే వ్యక్తి మాట్లాడారు. ఎమ్మెల్సీ సార్ ఎదుట తాను కూర్చుంటానని, మీమీద పోలీసులు ఒక్క దెబ్బ వేయకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడంతోపాటు ఎమ్మెల్సీ పీఏ గోపీకృష్ణను కాన్ఫరెన్స్ లో కలిపారు. ఆ కాన్ఫరెన్స్ లో గోపీకృష్ణ ఏం వరుణ్ అని అడగ్గా.. అదే అన్నా ఏదో ఒకటి చేసేస్తాం అని చెబుతారు. వచ్చి నన్ను కలవండి.. ఏమీ చేయొద్దు అని గోపీకృష్ణ చెబుతారు. తాజాగా ఈ ఆడియో కలకలం సృష్టిస్తోంది.