రికార్డ్స్ డిలీట్ ? లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్..! వైసీపీ చెడుగుడు ?
ఏపీ మద్యం కుంభకోణంలో మరో మలుపు. ఇప్పటివరకూ గత వైసీపీ ప్రభుత్వంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, దాదాపు 4 వేల కోట్లు చేతులు మారాయని, ఈ డబ్బులు అంతిమంగా వైఎస్ జగన్ కు చేరిందని ఆరోపిస్తున్న కూటమి సర్కార్ రూటు మార్చింది. నిన్న మద్యం స్కాంపై స్పందిస్తూ వైఎస్ జగన్.. చంద్రబాబు తనపై ఉన్న లిక్కర్ స్కాం ఆరోపణలు బలహీనపర్చేందుకు వైసీపీ లిక్కర్ స్కాం చేసిందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కూటమి నేరుగా సమాధానం ఇవ్వకపోవడంతో వైసీపీ దూకుడు పెంచింది.
మద్యం కుంభకోణం అంటూ ప్రభుత్వం చేస్తున్న హడావిడిపై నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ .. చంద్రబాబుపై గతంలో నమోదైన లిక్కర్ కేసును బలహీనపర్చేందుకు వైసీపీపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కూటమి నుంచి స్పందన లేదు. అయితే జగన్ పై ఇతరత్రా ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇవాళ తమకు అనుకూలమైన పత్రికల్లో లిక్కర్ స్కాం రికార్డులు కాలిపోయాయంటూ ఓ కథనం రాయించిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.

ముందు జగన్ నిన్న సంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ను ఆధారాలతో సహా వైయస్ జగన్ బయటపెట్టారని, దానికి బదులివ్వలేక ఎల్లో మీడియా 'ఈనాడు' ద్వారా ఒక అబద్దపు కథనాన్ని రాయించారని మండిపడ్డారు. బేతాళకథల్లో భాగంగా కూటమి ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కామ్కు సంబంధించి కోట్ల పేజీల సమాచారంను డిలీట్ చేశారంటూ ఈనాడులో రాయించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ఓవైపు డేటా మొత్తం నాశనం చేశారంటూనే, మరోవైపు బ్యాక్ ఎండ్ లో డేటాను సేకరించామనడం చూస్తుంటే చేసిన తప్పులను ఎలా కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నమే కనిపిస్తోందని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. నిన్న జగన్ వేసిన ప్రశ్నలకు, ఎక్స్ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు పంపిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి, చట్టాలను ఉల్లంఘించి, దర్యాప్తు సంస్థలను చేతుల్లోకి తీసుకుని, అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని జగన్ చేసిన ఆరోపణల్ని శైలజానాథ్ ప్రస్తావించారు.

అసలు లిక్కర్ కుంభకోణంకు పాల్పడింది ఎవరూ, డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది ఎవరూ, వాటి సామర్థ్యంను పెంచింది ఎవరూ, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ప్రివిజైల్ ఫీజు కింద రూ.1300 కోట్లు మాఫీ చేసింది ఎవరూ, హేతుబద్దత లేకుండా సీఎంకు కావాల్సిన డిస్టిలరీలకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చింది ఎవరూ అని శైలజానాథ్ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో నోట్ ఫైళ్ళలపై సీఎంగా చంద్రబాబు, ఆనాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సంతకాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కామ్లో ఎక్కడైనా తమ సంతకాలు ఉన్నాయా అని నిలదీశారు.

జగన్ ప్రశ్నలకు బదులివ్వలేక మీడియా సాయంతో వైసీపీపై బురదచల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని శైలజానాథ్ విమర్శించారు. ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేకుండా, బ్యాక్ ఎండ్ నుంచి తమకు నచ్చినట్లుగా సమాచారాన్ని తయారు చేసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. గత ప్రభుత్వానికి సంబంధించి లిక్కర్ వ్యవహారాల సమాచారంను అధికారిక ఫైళ్ళ నుంచే డిలీట్ చేస్తే, అందుకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ అధికారులు, లిక్కర్ సంస్థలపై సమాచారం డిలీట్ చేశారని ఎందుకు కేసులు నమోదు చేయలేదని అడిగారు. అంటే సమాచారం డిలీట్ అబద్ధమన్నారు.












Click it and Unblock the Notifications