నిమ్మగడ్డ రమేష్కుమార్ మెడకు డమ్మీ లేఖ: ఎందుకు ఫిర్యాదు చేయలేదంటోన్న వైసీపీ: అండగా బీజేపీ..!
అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజులుగా విస్తృతంగా చర్చల్లోకి వస్తోన్న అంశం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ రాసినట్టుగా చెబుతోన్న ఓ లేఖ. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని, తన ప్రాణాపాయం ఉందని అంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఆయన రాశారని చెబుతోన్న ఓ లేఖ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆ లేఖను తాను రాయలేదని రమేష్కుమార్ స్పష్టం చేసినప్పటికీ.. ఆ ప్రచారానికి మాత్రం పుల్స్టాప్ పడలేదు. ఇప్పుడు అదే లేఖ రమేష్కుమార్ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల కమిషనర్ స్థాయి అధికారి మీద నకిలీ లెటర్ ఎలా..?
జ్యుడీషియరీ అధికారాలను సంతరించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో పనిచేస్తోన్న ఓ అత్యున్నత స్థాయి అధికారి పేరు మీద నకిలీ లేఖను ఎవరు సృష్టించారు?..దాని వెనుక ఎవరు ఉన్నారు? ఆ స్థాయి అధికారి స్వయంగా ఆ లేఖను తాను రాయలేదని కుండబద్దలు కొట్టినప్పటికీ.. దాన్ని విస్తృతంగా ప్రచారంలోకి ఎవరు తీసుకొచ్చారు? అనే ప్రశ్నలను వరుసబెట్టి సంధిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు సైతం ఇదే అనుమానాలను లేవనెత్తడం ప్రాధాన్యతను సంతరిచుకుంది.

ఎందుకు ఫిర్యాదు చేయలేదంటోన్న వైసీపీ..
వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి తనకు ముప్పు ఉందంటూ ప్రచారంలోకి వచ్చిన ఆ లేఖను తాను రాయలేదని రమేష్కుమార్ స్పష్టం చేయడమైతే చేశారు గానీ.. దానిపై ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. ఏ పోలీస్ స్టేషన్లో కూడా లిఖితపూరకంగా కంప్లయింట్ ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు కులాన్ని అపాదించడం సరికాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రమేష్ కుమార్.. తన పేరు మీద ఓ నకిలీ లెటర్ విస్తృతంగా ప్రచారంలోకి వస్తే.. దాని మీద ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు డీజీపీకి ఫిర్యాదు..
ఈ వ్యవహారం వెనుక గల కారణాలు, వ్యక్తులను వెలుగులోకి తీసుకుని రావాలంటూ వైఎస్ఆర్సీపీ శాసన సభ్యులు స్వయంగా రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేయడం అనుకోని మలుపుగా భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్రెడ్డి, జోగి రమేష్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, కైలే అనిల్కుమార్ డీజీపీకి వినతిపత్రాన్ని అందజేశారు.
Recommended Video

సమగ్ర దర్యాప్తు జరిగితే గానీ..
ఈ లేఖ వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఈ లేఖను సృష్టించారని విమర్శిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. తమకు అనుకూలంగా ఉన్న మీడియాలో ఈ లేఖను ప్రచారం చేయడం ద్వారా జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. తన పేరు మీద వెలుగులోకి వచ్చిన నకిలీ లేఖ పట్ల రమేష్ కుమార్ సైతం స్పందించకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కూడా అదేనని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే రమేష్ కుమార్ ఫిర్యాదు చేయలేదని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications