యూట్యూబ్ చూస్తూ ఇంట్లోనే కాన్పు చేసుకున్న మహిళ.. తర్వాత ఏం జరిగింది..?
రాను రాను సోషల్ మీడియా జనాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ ఘటన చూస్తూనే అర్థం అవుతుంది. యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ చూసి చాలామంది వంటలు, ఇతర పనులు, కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు. ఇంకొందరు సరదాగా టైమ్ పాస్ కూ సోషల్ మీడియా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ గర్భిణి సంచలన నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ లో వీడియోలు చూసి తాను కూడా ఇలాగే కాన్పు చేసుకోవచ్చని భావించింది. అలాగే ప్రసవించేందుకు యత్నించింది. తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లా, ఊత్తుకుళి సమీపంలో ఉన్న పుంజై దళవాయ్పాళ్యంలో జరిగింది. మృతురాలిని శశికళ(32)గా గుర్తించారు.
ఏం జరిగిందంటే..?
కులైందస్వామి, శశికళ దంపతులు. వీరికి 2019లో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల పాప ఉంది. అయితే శశికళ రెండోసారి గర్భం దాల్చింది. మొదటి కాన్పునకు ఆమెకు సీజేరియన్ అయింది. ఆ తర్వాత నడుం నొప్పితో ఆమె ఇబ్బందులు పడింది. రెండో కాన్పును ఎలాగైనా ఆస్పత్రి వైద్యుల సాయం లేకుండా కనాలని భావించింది. ఇక ఈనెల 23న ఆమెకు నొప్పులు వచ్చాయి. అయినా కూడా ఆస్పత్రికి వెళ్లేందుకు శశికళ నిరాకరించింది.

యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంట్లోనే కాన్పు చేసుకోవాలని ప్రయత్నించింది. అలా ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత శశికళకు తీవ్రంగా రక్తస్రావం అయింది. దాంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications