టీడీపీ మద్దతుపై రాజకీయాల్లో దుమారం
దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును కేంద్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. 12 గంటల పాటు అంటే అర్ధరాత్రి 12 వరకూ దీనిపై చర్చ సాగింది. అనంతరం ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేశారు. 232 మంది దీన్ని వ్యతిరేకించారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమౌతోంది. ముస్లిం సామాజిక వర్గానికి చంద్రబాబు చేసిన మోసం చరిత్రలో నిలిచిపోతుందంటూ వైఎస్ఆర్సీపీ ఘాటుగా విమర్శిస్తోంది. ముస్లిం మైనారిటీ విషయంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేక వైఖరి ఈ బిల్లు విషయంలో మరోసారి బయపడిందంటూ మండిపడుతోంది.

ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్ధుల్ హఫీస్ ఖాన్ వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లింల పట్ల తెలుగుదేశం నమ్మకద్రోహానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లింల హక్కులను కాపాడటంపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది స్పష్టమైందని అన్నారు.
లక్షల ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డ్ తన హక్కులను కోల్పోయే పరిస్థితికి కారణమయ్యే ఈ బిల్లును చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. ఇంత కుట్ర జరుగుతుంటే 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఎన్డీఏలో కీలకమైన సంఖ్యాబలం ఉన్న చంద్రబాబు ప్రారంభంలోనే ఈ బిల్లును అడ్డుకుని ఉంటే- జేపీసీ దాకా బిల్లు వెళ్లేది కాదని చెప్పారు.
ఒకవైపు రాష్ట్రంలో ముస్లింలకు మాయమాటలతో వక్ఫ్ సవరణలో వారికి ఎటువంటి అన్యాయం జరగదంటూ మోసపు హామీలు ఇచ్చారని, మరోవైపు కేంద్రంలో బిల్లుకు మద్దతు పలికారని గుర్తు చేశారు. రెండు నాలుకల దోరణితో ముస్లింలను మాయ చేయాలని చంద్రబాబు అనుకున్నారని ఆరోపించారు.

రాజ్యాంగ విరుద్ద వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంకు సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ముస్లింలను వాడుకుని, ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. లోక్సభలో టీడీపీ, జనసేల వైఖరితో ముస్లింలను వంచించారని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్ధతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తోన్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు ద్రోహం చేశారని అంజాద్ భాష అన్నారు. 1995లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు, 2004లో ఓడిపోయిన తర్వాత మైనారిటీలకు క్షమాపణలు చెప్పారని, ముస్లిం వ్యతిరేక బీజేపీతో భవిష్యత్తులో కలిసేది లేదంటూ బహిరంగ సభలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు.
2014లో అవసరం కొద్దీ అదే ముస్లిం వ్యతిరేక బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చి ఒక్క మైనారిటీకి కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదని, రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ప్రాతినిథ్యం లేని ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం అయ్యాక మైనారిటీలకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని అంజాద్ భాషా విమర్శించారు.
మౌజన్లు, ఇమామ్లకు ఇవ్వాల్సిన 6 నెలల గౌరవ వేతనాలు పెండింగ్లో పెట్టాడని, 50 ఏళ్లు దాటిన మైనారిటీలకు పింఛన్లు, దుల్హన్ పథకం కింద పెళ్లి కుమార్తెకు రూ. లక్ష సాయం, మైనారిటీలకు రూ. 5లక్షల రుణాలు, హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. లక్ష ఇస్తానని హామీ ఇచ్చాడని, వీటిలో ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేసిన పాపాన పోలేదని అన్నారు.












Click it and Unblock the Notifications