టీడీపీ ఆఫీసుల్లో హెరిటేజ్ మాల్స్: నందమూరి ఫ్యామిలీనీ వదలని అంబటి: సెటైర్లతో
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సత్తెనపల్లి శాసన సభ్యుడు అంబటి రాంబాబు.. తెలుగుదేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాస్తా.. అంతర్ధాన దినోత్సవంలా అనిపించిందని అన్నారు. భవిష్యత్లో టీడీపీకి పుట్టగతులు ఉండవనే విషయం ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చూసి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. సూర్యోదయాన చేసుకోవాల్సిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూర్యాస్తమయాన నిర్వహించి.. తాము అంతర్థానమైపోతున్నామనే విషయాన్ని సింబాలిక్ చెప్పినట్టయిందని ఎద్దేవా చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు... టీడీపీలోకి ఎందుకు చేరడానేది ఈ తరానికి చెందిన యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకిలోకి విషసర్పంలా చంద్రబాబు ప్రవేశించారని విమర్శించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే రాజకీయ శక్తిగా ఎదిగిన టీడీపీ, ఎన్టీ రామారావు హయాంలో తిరుగులేని పాలన అందించిందని, అలాంటి పార్టీ చంద్రబాబు చేతిలో విలవిల్లాడుతోందని అన్నారు.

టీడీపీ ఇక బతికి బట్టకట్టే పార్టీ కాదని, ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితికి చేరిందని అంబటి చెప్పారు. సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల తరహాలో టీడీపీ తయారవుతుందని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ వారసులకు పౌరుషం ఉంటే చంద్రబాబు ఈ రకంగా పార్టీని నాశనం చేసే పరిస్థితికి రాకుండా కాపాడేవారని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలనే అత్యాశలో చంద్రబాబు ఉన్నారని, ఆయనేమో మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయారని చురకలంటించారు. ఆదాయానికి మించిన అప్పులు చేస్తున్నామంటూ చంద్రబాబు చేసే విమర్శల్లో పస లేదని అంబటి అన్నారు.
చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వం అప్పుశాతం 49.92 శాతం పెరిగితే.. రాష్ట్రంలో డాని శాతం 132.31 శాతంగా నమోందైందని గుర్తు చేశారు. జాతీయ స్థాయి రుణాలు 50 శాతానికి కూడా దాటకపోగా.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం చేసిన రుణాలు వందశాతానికి మించి నమోదు కావడం ఎవ్వరూ విస్మరించలేదని అన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పనిచేశారని చెప్పారు. అప్పు చేసిన ప్రతి పైసాకు జవాబుదారీతనంగా వ్యవహరించారని అన్నారు.
ప్రత్యేక హోదా అనే పదాన్ని ఉచ్ఛరించే నైతిక హక్కు కూడా చంద్రబాబుకు లేదని అంబలి రాంబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని బతికిస్తుందా, ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండం అని సుదీర్ఘ ఉపన్యాసాలు చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువునా ముంచాడని విమర్శించారు. ప్రత్యేక హోదా మాత్రమే ఈ రాష్ట్రానికి సంజీవని అని తాము నమ్ముతున్నామని, దాని కోసం పోరాటం చేస్తూనే ఉంటామని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. ప్యాకేజీ స్వీకరించి రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబుకు హోదా గురించి మాట్లాడే అర్హతే లేదని మండిపడ్డారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, మూలన కూర్చోవాల్సి వచ్చిందని అన్నారు. పరిపాలనలో వైఎస్సార్ అనేక మైలురాళ్లను నెలకొల్పారని, అలాంటి పరిపాలనను ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ హయాంలో ప్రజలు ప్రత్యక్షంగా తిలకిస్తున్నారని అన్నారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడం కలేనని అన్నారు. వైఎస్ జగన్ రూపంలో ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రజా నాయకుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పారు. టీడీపీ కార్యాలయాల్లో ఇక హెరిటేజ్ మాల్స్ పెట్టుకోవాల్సిందే తప్ప.. దాంట్లో పనేముండదని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications