టిడిపిలో చేరికపై వైసిపి ఎమ్మెల్యే జలీల్ ట్విస్ట్, రోజా తీరుపై 25లోగా నివేదిక!
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో చేరుతారనుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గురువారం ట్విస్ట్ ఇచ్చారు. తనకు తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచన లేదని ఆయన చెప్పారు. అభివృద్ధి పనుల కోసమే తాను చంద్రబాబును కలిశానని చెప్పారు.
గురువారం ఉదయం మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుతో కలిసి జలీల్ ఖాన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై జలీల్ ఖాన్ స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశానన్నారు. అంతమాత్రాన పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.
చివరి వరకు తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. జగన్ ఆశీస్సులు ఉన్నంత వరకు పార్టీని వీడేది లేదని చెప్పారు. కాగా ఉదయం జలీల్ ఖాన్.. సీఎంను కలిశారు. అతను తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి.
మరోవైపు, నూజివీడు ఎమ్మెల్యే మేకా అప్పారావు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు తాము సైకిల్ ఎక్కుతామన్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తాము తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం లేదన్నారు.
వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు: కోడెల
వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని సభాపతి కోడెల శివప్రసాద్ రావు చెప్పారు. అసెంబ్లీలో సభ్యుల అనుచిత వ్యవహారంపై 25లోగా నివేదిక అందుతుందని చెప్పారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యే రోజా తీరుపై అధికార పార్టీ సభ్యులు ఆక్షేపణ తెలిపిన విషయం తెలిసిందే.
సభ్యుల అనుచిత వ్యవహారంపై నివేదికను ప్రివిలైజ్ కమిటీకి పంపిస్తామని, నివేదిక ఆధారంగా సభలో చర్చించి, సభ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మంత్రులు దొరకకుండా తిరుగుతున్నారు: రఘువీరా
జన్మభూమి కమిటీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ లైసెన్సులు ఇచ్చారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. మంత్రులు ప్రజలకు దొరకకుండా తిరుగుతున్నారన్నారు. తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమవాసులను చంద్రబాబు రౌడీలుగా చిత్రీకరిస్తున్నారన్నారు.
మునిగే నావను ఎక్కుతారా: శ్రీకాంత్ రెడ్డి
టిడిపి మునిగే నావ అని, దానిని ఎవరు ఎక్కుతారని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తెలంగాణలో తన దుకాణాన్ని అమ్మేసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో టిడిపి పరిస్థితిపై ప్రజల దృష్టి పడకుండా ఉండేందుకు ఇదో మైండ్ గేమ్ అన్నారు.
దానికి తోడు బాబు మైండ్ గేమ్కు ఎల్లో మీడియా మద్దతు పలుకుతోందన్నారు. టిడిపి కార్యాలయం ఆదేశాల మేరకే ప్రతిపక్షంపై ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో తమ సంకల్పం చెదిరిపోదాన్నారు.