డీఎస్సీకి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే-జగన్ నిర్ణయంతో తాజాగా ఉద్యోగం -ఏం జరిగిందంటే ?
ఏపీలో 1998 డీఎస్సీ అభ్యర్ధుల విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎన్నో కుటుంబాల్లో సంతోషం నింపింది. ఇదే క్రమంలో ఉద్యోగాలపై ఇక ఆశలు వదులుకుని వేర్వేరు వృత్తుల్లోకి, చిన్నా చితకా ఉద్యోగాల్లోకి, చివరికి రాజకీయాల్లోకి కూడా వెళ్లిపోయిన పలువురికి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఇదే కోవలో అనకాపల్లి జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉద్యోగానికి అర్హత సాధించారు.

1998 డీఎస్సీ అభ్యర్ధులకు ఉద్యోగాలు
1998లో డీఎస్సీ పరీక్ష రాసి అర్హత సాధించిన దాదాపు 5 వేల మంది అభ్యర్ధులకు అప్పట్లో సాంకేతిక కారణాలతో ఉద్యోగాలు ఇవ్వలేదు. అప్పటి నుంచి వారు పలు న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నారు. అలాగే ప్రభుత్వాల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇక ఆశలు వదులుకుని ఇతరత్రా వృత్తుల్లో, వ్యాపారాల్లో, చిన్నా చితకా ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కూడా సెటిల్ అయిపోయారు. అలాంటి వారికి ఊరటనిచ్చేలా వైసీపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యాసంస్కరణలు అమలువుతున్న నేపథ్యంలో గతంలో అర్హత సాధించిన వీరందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో వీరి సంతోషానికి అవధుల్లేకుండా పోతోంది.

జగన్ నిర్ణయంతో అద్భుతాలు
సీఎం జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రభావంతో పలు అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడో 22 ఏళ్ల క్రితం డీఎస్సీ రాసి ఉద్యోగాలు రాకపోవడంతో ఇక చాలనుకుని ఆశలు వదిలేసుకున్న వారు వేర్వేరు చోట్ల స్ధిరపడ్డారు. అలాంటివారంతా ఇప్పుడు సీఎం జగన్ ప్రకటనతో తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు సిద్దమవుతున్నారు. మరికొందరు ఇతరత్రా వృత్తుల్లో స్ధిరపడి తిరిగి వెనక్కి రాలేని పరిస్ధితుల్లో ఉన్నారు. రాజకీయాలు, వ్యాపారాల్లో ఉన్న వారు ఇలా వెనక్కి వచ్చేందుకు సిద్దం కావడం లేదు. అలాగే టీచర్ ఉద్యోగంపై ఆశలు వదులుకుని వీధుల్లో తిరిగి వస్తువులు అమ్ముకుంటున్న ఓ అభ్యర్ధి తనకు ఉద్యోగం వచ్చిందని తెలియగానే ట్రిమ్ గా తయారైన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకీ టీచర్ ఉద్యోగం
1998 డీఎస్సీకి అర్హత సాధించిన అభ్యర్ధుల జాబితాలో తాజాగా వైసీపీకి చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేరు కూడా దర్శనమిచ్చింది. ఎప్పుడో 30ఏళ్ల క్రితం మద్రాస్ అన్నామలై యూనివర్శిటీలో బీఈడీ చదివి, పాతికేళ్ల క్రితం డీఎస్సీ రాసి ఇక ఉద్యోగం రాదని డిసైడ్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కూడా అయిపోయిన ధర్మశ్రీ కూడా ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయంతో ఉద్యోగానికి అర్హులయ్యారు. అప్పుడే తనకు ఉద్యోగం వచ్చినట్లయితే టీచర్ గా స్ధిరపడేవాడినని గతానుభవాల్ని ధర్మశ్రీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఉద్యోగం రాకపోవడం వల్ల ఆ తర్వాత బీఎల్ చేశానని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి యువజన నేతగా పనిచేసి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేకూడా అయినట్లు ధర్మశ్రీ ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. 1998 డీఎస్సీ బ్యాచ్ తరఫున సీఎం జగన్ కు ఆయన కృతజ్ఢతలు తెలిపారు.












Click it and Unblock the Notifications