కుప్పంలో ఓడాక చంద్రబాబుకు పిచ్చెక్కింది-రోజా వ్యాఖ్యలు-వరదలేమైనా పుష్కరాల ఘటనా ?
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయంలో మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా రాయలసీమలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రజలు ప్రభావితమయ్యారని, ఈ వరదలు మానవతప్పిదమేనని విమర్శించారు. దీనిపై ఇవాళ వైసీపీ స్పందించింది.
రాయలసీమ టూర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు కుప్పంలో టీడీపీ ఓటమి తర్వాత పిచ్చెక్కిందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన రోజా... చంద్రబాబు వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. హుద్ హుద్ తుపాను బాధితుల్ని ఇప్పటికీ ఆదుకోని చంద్రబాబు.. రాయలసీమ బాధితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రోజా అన్నారు
గాల్లో వచ్చిన వాడు గాల్లోనే పోతాడు అంటూ చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి సోనియా, చిదంబరంల కాళ్ళమీద పడింది చంద్రబాబేనన్నారు. భారీ వర్షాలను మానవతప్పిదం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని రోజా ఆక్షేపించారు. గోదావరి పుష్కరాల సందర్బంగా షూటింగ్ పిచ్చితో 29 మంది ని చనిపోయేలా చేసింది చంద్రబాబు అనీ.. మానవ తప్పిదం అంటే అదే అని అన్నారు.ఆ ఘటనలో వాస్తవాలు బయటకు రాకుండా సీసీ ఫుటేజ్ ని డిలీట్ చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ ఫుటేజ్ బయటకు వచ్చి ఉంటే చంద్రబాబు చిప్పకూడు తినేవాడు అని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం లోకేష్ ఎమ్మెల్యే కావడం జరగని పని రోజా జోస్యం చెప్పారు.