వైసీపీ ఎమ్మెల్సీ భగీరధ రెడ్డి మృతి..!!
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరధ రెడ్డి మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన కాలేయ సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయనకు సమస్యత తీవ్రం కావటం..నాలుగు రోజులుగా దగ్గు బాగా వస్తుండటంతో హుటా హుటిన నంద్యాల జిల్లా అవుకులోని తన నివాసం నుంచి గత నెల 25న హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజులుగా ఎమ్మెల్సీ భగీరధ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు.
దీంతో శ్వాస ఇబ్బంది కావటంతో వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. ఆయన్ను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లు వైద్యులు చెప్పారు. తొలుత వెంటిలేటర్ ద్వారా వంద శాతం ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చిందని, ఆ తరువాత 60 శాతానికి తగ్గించటంతో క్రమేణా కోలు కుంటారనే ఆశాభావం ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేసారు. అయితే, పరిస్థితి మరో సారి విషమించటంతో ఈ మధ్నాహ్నం ఎమ్మెల్సీ భగీరధ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భగీరధ రెడ్డి తండ్రి చల్లా రామకృష్ణా రెడ్డి వైస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీగా పనిచేశారు.

కాగా 2020లో ఆయన రామకృష్ణా రెడ్డి కరోనా కారణంగా మృతి చెందటంతో ఆయన కుమారుడు భగీరథ రెడ్డికి సీఎం జగన్ ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. తండ్రి చల్లా రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసారు. భగీరధ రెడ్డి 2007 నుంచి 2008 వరకు జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్ సెక్రటరీగా, 2009 నుంచి 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పని చేశారు. 2019 మార్చి 8న తన తండ్రితో కలిసి వైసీపీలో చేరారు. తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి భగీరథరెడ్డిని 25 ఫిబ్రవరి 2021న వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications