శభాష్ విజయ్..! తమిళనాట అమ్మ క్యాంటీన్లపై కీలక నిర్ణయం..!
ఈ మధ్య దక్షిణాది రాజకీయాల్లో వచ్చిన మార్పులు దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభావమూ లేక మరో కారణమూ తెలియదు కానీ రాజకీయ నేతలు మాత్రం చాలా కొత్తగా కనిపిస్తున్నారు, అలాగే నిర్ణయాలూ తీసుకుంటున్నారు. వాటిని కచ్చితంగా ప్రజలు గమనిస్తారన్న ఆలోచన వారిలో కనిపిస్తోంది. ఇదే కోవలో తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
2011-16లో జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళనాడు వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్లను (ఉనవగామ్లను)
ప్రారంభించింది. వీటిని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం ఎంకే స్టాలిన్ కూడా కొనసాగించి అన్నార్తుల ఆకలి తీర్చారు. ఇప్పుడు ఆయన తర్వాత అధికారం చేపట్టిన విజయ్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా అమ్మ క్యాంటీన్ల (Amma Canteens) పునరుద్ధరణకు, ఆధునీకీకరణకు ఆదేశాలు ఇచ్చేశారు.

2013 ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్బంగా ప్రారంభించిన ఈ అమ్మ క్యాంటీన్లు ఈ 13 ఏళ్లలో లక్షల మంది ఆకలి తీర్చాయి. ఇప్పుడు రాష్ట్రంలోని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో పనిచేస్తున్న 237 క్యాంటీన్లలో పలు మార్పులు చేసి మెరుగైన ఆహారం అందించాలని సీఎం విజయ్ ఆదేశాలు ఇచ్చారు. వాటిలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, మరిన్ని వంటపాత్రలు/పరికరాలను సేకరించాలని, తద్వారా ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఈ మధ్య అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవనే అభిప్రాయం సీఎం దృష్టికి రావడంతో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ ఆదేశాలు ఇచ్చారు.














Click it and Unblock the Notifications