రఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్లో సంచలన దృశ్యాలు
సుప్రీంకోర్టు జోక్యం తర్వాత జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎంపీ రఘురామకృంరాజు అరెస్టు వ్యవహారం, దానికి సంబంధించిన రాజకీయ వివాదాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. రఘురామపై ఏపీ సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసులో ఏ2, ఏ3లుగా ఉన్న మీడియా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మరింత ఉత్కంఠగా మారింది. రఘురామ అరెస్టుపై మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించడం రాజకీయంగా సంచలనం రేపుతున్నది. మరోవైపు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీకి వైద్య పరీక్షలు ముగిశాయి. వివరాల్లోకి వెళితే..

రఘురామ పెద్ద డ్రామా
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ అరెస్టు, అనంతర పరిణామాలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రఘురామ తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, కోర్టుకు హాజరైన సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసి, వారు తెచ్చిన భోజనం కూడా తిన్న ఎంపీ.. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయగానే సీఐడీ పోలీసులు కొట్టారంటూ డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. రఘురామ అరెస్టు విషయంలో ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రమేయం లేదని, సీఐడీ వాళ్లు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారని సజ్జల గుర్తు చేశారు.

మీసం మెలేసి.. కాళ్లెత్తి చూపి..
''రఘురామ ఓ పక్క మీసం మెలేస్తారు... మరో పక్క కారులో వెళుతూ అరికాళ్లు ఎత్తి చూపిస్తారు. మళ్లీ కారు దిగిన తర్వాత నడవలేకపోతున్నట్లు పక్కవారి భుజంపై ఆసరాతో వెళతారు. ఈ వ్యవహారం మొత్తంలో ఎక్కడైనా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడమో లేక, మానవ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడమో చేయలేదు. వైసీపీ ప్రభుత్వంపై మొదట్నించి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నది. లేనిపోనివన్నీ సీఎం జగన్ కు ఆపాదించడం, బురద చల్లాలని చూడడం వారికి అలవాటైన పని. నిజానికి టీడీపీకి, దాని అనుకూల మీడియాకు తెలిసింది ఇదొక్కటే. అంతేకాదు..

సీఎం జగన్పై భారీ కుట్రలు..
కేవలం ముఖ్యమంత్రిని తిట్టడంతో రఘురామ ఆగలేదు. కులాలు, మతాలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ అధికారులు.. ఇలా అన్నిటిపైనా అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతంలో రఘురామ మానసిక స్థితి సరిగాలేకనో, ఆక్రోశం భరించలేకనో అన్నాడనో సరిపెట్టుకోడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ కు వ్యతిరేకంగా భారీ కుట్రకోణం ఉంది. రెండు న్యూస్ చానళ్లు రఘురామ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రోత్సహించాయి. వైసీపీ నుంచి దూరమైన ఎంపీని చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా ఓ పావులా వాడుకున్నాయి. రఘురామ అరెస్టుతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో కేసులు నమోదు కాకముందే పచ్చ మంద భుజాలు తడుముకుంటోంది. ఆ క్రమంలోనే..

కేసీఆర్పై చంద్రబాబు రాజద్రోహం
సీఐడీ నమోదు చేసిన సుమోటో కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టయిన తర్వాత ఆయనపై మోపిన అభియోగాలపై చంద్రబాబు చాలా విడ్డూరంగా మాట్లాడారు. రఘురామపై రాజద్రోహం కేసులు మోపడమేంటి? అని వాపోతూ, అసలు రాజద్రోహం అంటే ఏమిటో తనకు తెలియదన్నట్లుగా, ఆ పదాన్నే ఏనాడూ వినలేదన్నట్లుగా చంద్రబాబు జీవించారు. గతంలో ఇదే చంద్రబాబు హయాంలోనే కేసీఆర్(ప్రస్తుత తెలంగాణ సీఎం) పై 12సార్లు రాజద్రోహం కేసులు పెట్టించారు. ఆమధ్య గుంటూరులో న్యాయవాదులపైనా టీడీపీ సర్కారు రాజద్రోహం కేసులు పెట్టింది. మరి ఆ రోజు కేసీఆర్ ఉన్నది రాజకీయ విభేదమని, దాన్ని రాజకీయంగానే తేల్చుకోవాలని చంద్రబాబుకు అనిపించలేదా? వ్యక్తిగత విద్వేషాలతో ఎప్పుడూ పైచేయి సాధించలేరు, ఈ విషయాన్ని జగన్ గుర్తించి వాటికి దూరంగా ఉంటారు'' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే..

సీల్డ్ కవర్లో రఘురామ రిపోర్టులు, వీడియో
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షలు ముగిశాయి. రఘురామ ల్యాబ్ రిపోర్ట్స్ను ఆర్మీ వైద్య బృందం పరిశీలించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి సీల్డ్ కవర్లో అధికారులు భద్రపర్చారు. న్యాయాధికారి నాగార్జున నేతృత్వంలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘురామ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ వైద్యులు చెబుతున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆర్మీ ఆస్పత్రిలోనే రఘురామకు చికిత్స అందిస్తారు. సీల్డ్ కవర్ రిపోర్టులను అధికారులు సుప్రీంకోర్టును పంపనున్నారు. ఈనెల 21న(శుక్రవారం) రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుండగా మెడికల్ రిపోర్టుల్లో ఏం తేలిందనేది ఉత్కంఠగా మారింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న రఘురామను కలుసుకోనివ్వలేదని ఎంపీ కొడుకు భరత్ ఆగ్రహం వెళ్లగక్కారు.












Click it and Unblock the Notifications