జగన్కు రఘురామ లేఖ: మీ చుట్టూ ఉన్న కోటరి కరెక్ట్ కాదంటూ..నేరుగా: టీటీడీ, బీజేపీ విందు సహా
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎంపీగా గుర్తింపు పొందిన నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాను అందుకున్న షోకాజ్ నోటీసుకు సమాధానాన్ని ఇచ్చారు. ఇదివరకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత, జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డిని ఉద్దేశించి లేఖ రాశారు. ఈ సారి నేరుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా లేఖను రాశారు. షోకాజ్ నోటీసుకు సమాధానాలను ఇచ్చారు.
Recommended Video
కీలకాంశాల ప్రస్తావన..
తన లేఖలో రఘురామ కృష్ణంరాజు పలు కీలకాంశాలను ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిరర్థక ఆస్తుల అమ్మకం విషయాన్ని సైతం ఆయన తన లేఖలో పొందుపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేల తీరునూ ఎండగట్టారు. ఇదివరకు తాను చేసిన ఆరోపణలపై సమగ్రమైన వివరణ ఇచ్చారు. సుదీర్ఘమైన లేఖను రాశారు రఘురామ.
కోటరి వల్లే దూరం..
వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ సరికాదంటూ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. తనను కావాలనే పార్టీకి దూరం చేయడానికి ఆ కోటరీ ప్రయత్నిస్తోందని పరోక్షంగా విమర్శలను గుప్పించారు. జగన్ను కలుసుకోవడానికి తాను పలుమార్లు ప్రయత్నించినప్పటికీ.. ఆ కోటరీ అడ్డుకుందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఓ లోక్సభ సభ్యుడినైన తనకే ఈ పరిస్థితి ఉంటే ఇక దిగువ శ్రేణి పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల ఆ కోటరీ ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనేది ఆలోచించాలని ఆయన జగన్కు సూచించారు. తనకు కనీసం అపాయింట్మెంట్ దొరక్కుండా చేశారని విమర్శించారు.
పార్టీ నేతలే దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే ఎలా..
తాను ఓ లోక్సభ సభ్యుడిననే విషయాన్ని జిల్లా పార్టీ నాయకులు విస్మరించారని రఘురామ ఆరోపించారు. జిల్లా నాయకుల కనుసన్నల్లోనే తనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారని పేర్కొన్నారు. సొంత పార్టీ నాయకులే తన దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సందర్భాలు జిల్లాలో నెలకొని ఉందని వైఎస్ జగన్కు వివరించారు. నియోజకవర్గానికి వస్తే.. భౌతిక దాడులకు పాల్పడుతామని పార్టీ ఎమ్మెల్యేల అనుచరులే తనను హెచ్చరించారని చెప్పుకొచ్చారు. ఇదంతా పార్టీ ఎమ్మెల్యేల సారథ్యంలోనే జరుగుతోందని అన్నారు.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్..
తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయని రఘురామ వివరించారు. రాయలసీమ జిల్లాలతో పాటు విదేశాల నుంచి కూడా తనకు బెదిరింపు ఫోన్కాల్స్ అందాయని అన్నారు. ఈ కారణంతోనే తాను డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశానని అన్నారు. ఇదే విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, హోం శాఖ మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. కేంద్ర బలగాల నుంచి రక్షణ కావాలని తాను కోరకున్నానని అన్నారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి దృష్టికి..
గృహ నిర్మాణ విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అవకతవకలు జరుగుతున్నాయనే విషయాన్ని తాను సంబంధిత శాఖ మంత్రి రంగరాజు దృష్టికి తీసుకెళ్లానని, ఆయనను ముందే హెచ్చరించానని చెప్పారు. ఆయన నుంచి తాను ఆశించిన సమాధానం రాలేదని అన్నారు. పైగా తనను టార్గెట్గా చేసుకున్నట్లు మాట్లాడటం తనకు నచ్చలేదని అన్నారు. పలుమార్లు తనను టార్గెట్గా చేసుకున్నట్లు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేశారని చెప్పారు.
టీవీ ఛానళ్లను నేను ఎంచుకోలేదు..
కొన్ని టీవీ ఛానళ్ల డిబేట్లకు తాను హాజరైన మాట వాస్తవమేనని, ఈ విషయంలో తన ప్రమేయం లేదని అన్నారు. తాను వ్యక్తిగతంగా ఏ ఒక్క టీవీ ఛానల్కు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదని అన్నారు. ఆ డిబేట్లలో కూడా తాను పార్టీ గురించి గానీ, పార్టీ అధినేత గురించి గానీ, ప్రభుత్వంపై గానీ విమర్శలను చేయలేదని చెప్పారు. జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకుంటోన్న తన వ్యతిరేక వాతావరణంపై మాత్రమే తాను ప్రస్తావించుకుంటూ వచ్చానని అన్నారు.
ఎప్పటికీ సైనికుడినే..
తాను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అధినేతకు విధేయుడిగానే ఉంటానని రఘురామ స్పష్టం చేశారు. పార్టీలో ఓ నిబద్ధత గల సైనికుడిగా పని చేస్తాననీ చెప్పారు. తనకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వాలని రఘురామ వైఎస్ జగన్కు విజ్ఙప్తి చేశారు. స్వయంగా కలిసి తాను అన్ని విషయాలనూ వివరిస్తానని పునరుద్ధాటించారు. త్వరలోనే తనుకు అపాయింట్మెంట్ లభిస్తుందని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రిగా..
వైఎస్ జగన్ను ఆయన అభినందిస్తూ తన లేఖను ప్రారంభించారు. సీ-ఓటర్ సర్వేలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ పరిపాలను అందిస్తోన్న ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించడం పట్ల అభినందననలను తెలియజేశారు. అనంతరం విజయసాయి రెడ్డి నుంచి షోకాజ్ నోటీసులను అందుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ పేరును తప్పుగా రాయడాన్ని రఘురామ ప్రధానంగా ప్రస్తావించారు సాయిరెడ్డి విషయంలో.
శ్రీవారికి భక్తుడిగా..
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిరర్థక ఆస్తుల అమ్మకాల విషయంలో తాను శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తుడిగా స్పందించానని అన్నారు. ఇదే విషయంపై ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రతి శ్రీవారి భక్తుడు కూడా స్పందించారని, తాను కూడా అదే విధంగా తన మనోభావాలను పంచుకున్నానని చెప్పారు. ఇందులో మరో ఉద్దేశం లేదని, రాజకీయ దురుద్దేశం ఎంతమాత్రమూ లేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.
బీజేపీ నేతలతో విందు భేటీ
దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నాయకులతో విందులో పాల్గొనడంపైనా రఘురామ వివరణ ఇచ్చారు. జాతీయ స్థాయిలో కొందరు ఎంపిక చేసిన అన్ని పార్టీల ఎంపీలకు మాత్రమే బీజేపీ నేతలకు విందుకు ఆహ్వానించారని, వైసీపీ తరఫున తాను ఆ భేటీకి హాజరు అయ్యానని అన్నారు. బీజేపీలో చేరుతారనే వార్తలను తాను అప్పడే ఖండించానని చెప్పారు. గోదావరి రుచులు, తీపిని వారికి రుచి చూపించానని చెప్పారు.