జగన్, సాయిరెడ్డిని వదలని రఘురామ-బెయిల్స్ రద్దు కోసం హైకోర్టులో మళ్లీ పిటిషన్-అసలు వ్యూహమిదే
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరు. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో వీరిద్దరి బెయిళ్ల రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అయినా రఘురామ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా హైకోర్టులో ఇదే అంశంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్ ను రిజిస్ట్రీ సాంకేతిక కారణాలతో తిరస్కరించింది. దీంతో ఆయన ఇవాళ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

జగన్, సాయిరెడ్డిని వదలని రఘురామ
వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచి ఆ పార్టీపైనే రెండేళ్లుగా పోరాటం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వీరిపై దర్యాప్తు జరుగుతున్న అక్రమాస్తుల కేసును టార్గెట్ చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉంటూ బెయిల్ పై ఉన్న జగన్, సాయిరెడ్డిని వారి బలహీనతలపై టార్గెట్ చేస్తూ రఘురామ న్యాయ ప్రక్రియ ద్వారా వారిని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో సీబీఐ కోర్టులో వరుస పిటిషన్లు దాఖలు చేసి ఉత్కంఠ రేపారు. కానీ సీబీఐ కోర్టు మాత్రం రఘురామ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో రఘురామకు భారీ షాక్ తప్పలేదు. అయినా రఘురామ వెనక్కి తగ్గడంలేదు.

తెలంగాణ హైకోర్టులో సవాల్
అక్రమాస్తుల కేసులో జగన్, సాయిరెడ్డి బెయిళ్లను రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేయడంతో ఇప్పుడు ఆయన తెలంగాణ హైకోర్టులో ఈ తీర్పుల్ని సవాల్ చేశారు. తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కానీ సాంకేతిక అంశాలతో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ వాటిని తిరస్కరించింది. దీంతో ఆయా సాంకేతిక అంశాల్ని తిరిగి సరిద్దిద్ది రఘురామ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి ఉత్కంఠ రేపేలా కనిపిస్తోంది. తాజాగా సరైన కారణాలు ఉంటే తప్ప నిందితులకుఇచ్చిన బెయిళ్లు రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో రఘురామ పిటిషన్లపై హైకోర్టు స్పందన కీలకంగా మారింది.

రఘురామ తాజా పిటిషన్లు
జగన్, సాయిరెడ్జి బెయిల్స్ ను రద్దు చేయాలని కోరుతూ తాజాగా తాను దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ సాంకేతిక కారణాలతో తిరస్కరించిన నేపథ్యంలో రఘురామ మరోసారి తాజాగా సరిదిద్దిన పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. అలాగే అక్రమాస్తుల కేసులోనూ విచారణ వేగవంతం చేయాలని హైకోర్టును ఆయన అభ్యర్ధించారు. అక్రమాస్తుల కేసులో గతంలో జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి ఆయనపై నమోదైన 11 ఛార్జిషీట్లలో సమగ్ర విచారణ జరపాలని తాజా పిటిషన్ లో రఘురామ హైకోర్టును కోరారు.

రఘురామ అసలు వ్యూహమిదే ?
జగన్, విజయసాయిరెడ్డికి గతంలో ఇచ్చిన బెయిల్స్ రద్దు చేయాలని కోరుతూ వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు వీటి వెనుక అసలు వ్యూహాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. కానీ ఆయన దాఖలు చేస్తున్న పిటిషన్లను చూసిన వారికి మాత్రం ఇవి రాజకీయ కారణాలతో దాఖలు చేస్తున్నవేనని ఇట్టే అర్దమవుతోంది. అదే సమయంలో సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ శరవేగంగా సాగుతోంది. ఇప్పుడు హైకోర్టులో వరుస పిటిషన్లు వేయడం ద్వారా ఆ విచారణను సీబీఐ కోర్టు సమగ్రంగా చేపట్టేలా చేయాలన్నదే రఘురామ వ్యూహంగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై విచారణ జరుగుతోంది. ఆ తర్వాత సీబీఐ ఛార్జిషీట్లపై విచారణ జరగబోతోంది. ఇలా సుదీర్ఘంగా సాగే ఈ విచారణను హైకోర్టు పర్యవేక్షణలో సాగేలా ఉత్తర్వులు తెచ్చుకోవాలన్న వ్యూహం కూడా రఘురామకు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications