జగన్పై అమిత్ షా యాక్షన్ -విదేశీ పర్యటనలు రద్దు -పవన్ చెప్పింది చేస్తా -తిరుపతిలో రీపోల్: ఎంపీ రఘురామ
సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్పై వరుసపెట్టి విమర్శలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి పేట్రేగిపోయారు. అక్రమాస్తులకు సంబంధించి 11 చార్జిషీట్లతో ఏ1గా ఉన్న జగన్, ఏ2 విజయసాయిరెడ్డిలు ఏకంగా సీబీఐ ప్రాంతీయ అధికారులతో కుమ్మక్కయ్యారని, ఖరీదైన ఫ్లాట్లను గిఫ్టులుగా ఇస్తూ ప్రలోభపెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అనుబంధ మీడియా సంస్థలు కొన్ని సీబీఐ అంతర్గత విషయాలపై కథనాలు రాస్తుండటం కూడా గర్హనీయమని, మొత్తం వ్యహారాలపై కేంద్రానికి ఫిర్యాదుచేశానని ఎంపీ తెలిపారు. శనివారం 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో మాట్లాడుతూ రఘురామ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
ఎంపీ రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిల జాకెట్ చించడం తప్పు, మరి అమరావతి మహిళల సంగతేటి?
నాపై 8 కేసులు, పారిపోయే స్కెచ్!
''పలు నేరాలకు సంబంధించి 11 చార్జిషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్.. సీఎం పదవిని అడ్డంపెట్టుకుని సీబీఐ కేసు విచారణను ప్రభావితం చేస్తున్నాడు. వాటికి సంబంధించిన ఆధారాలతోనే జగన్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశాను. వచ్చే వారం అది విచారణకు రానుంది. ఈలోపే వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తోన్న మీడియా సంస్థలు కొన్ని సీబీఐ అంతర్గత విషయాలను కోట్ చేస్తూ నాపై విచ్చలవిడిగా కథనాలు రాశాయి. జగన్ బెయిల్ రద్దు కోసం పోరాడుతోన్న నాపై సీబీఐ కొత్తగా ఎనిమిది కేసులు నమోదు చేయనుందని, వాటిని ఎదుర్కోలేక నేను విదేశాలకు పారిపోవాలని స్కెచ్ గీస్తున్నట్లు వైసీపీ అనుబంద వెబ్ సైట్లలో కథనాలు రాయించారు..
అచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువు
జగన్ జైలుకెళ్లాకే విదేశాలకు..
నేను చేస్తున్నది సర్పయాగమని గతంలోనే చెప్పాను, అది ముగిసేదాకా ఏపీలో అడుగుపెట్టబోననీ మాటిచ్చాను. నేను విదేశాలకు పారిపోతానని ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. జగన్ రెడ్డిని జైలుకు పంపేదాకా నేను విదేశాలకు వెళ్లను. ఏవైనా పర్యటనలుంటే రద్దు చేసుకుంటాను. ఏపీలో జరుగుతోన్న అన్యాయాలను నిగ్గదీస్తూ, అక్రమార్కుల భరతం పట్టేదాకా నేను ఊరుకోను. సీబీఐని జగన్ అండ్ టీమ్ ప్రలోభపెడుతోందని చెప్పడానికి నా దగ్గరున్న ఆధారాలను కోర్టుకు ఇచ్చాను. అలాగే సీబీఐ చెప్పిందంటూ నా మీద తప్పుడు కథనాలు రాసేవాళ్లను కూడా వదలిపెట్టను. అదీగాక..
వివేకా హత్య కేసులోనూ కాంప్రమైజ్..
వైఎస్సార్, జగన్ లను అభిమానించేవాళ్లలో చాలా మంది వివేకానందరెడ్డిని కూడా గౌరవించేవారు. ఎన్నికలకు ముందు జరిగిన హత్యను జగన్ రాజకీయంగా వాడుకున్నాడు. కానీ సీఎం అయి రెండేళ్లయినా వివేకా హంతకులు బయటికి రాలేదు. ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు ఇచ్చిన కీలక సమాచారన్ని సీబీఐ పరిగణలోకి తీసుకోకపోవడం.. దర్యాప్తు సంస్థను జగన్ కాంప్రమైజ్ అయ్యేలా చేశాడని అర్థమవుతోంది. ఈ మొత్తం వ్యవహారాలను పూసగుచ్చినట్లు వివరిస్తూ కేంద్రంలోని పెద్దలకు నేను ఫిర్యాదు చేశాను. నేను తప్పు చేసి ఉంటే నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు, ఆల్రెడీ నాపై అనర్హత వేటుకు మా వాళ్లు పిటిషన్ వేశారు, కానీ వారికి చెప్పుదెబ్బలాంటి ప్రతిస్పందన ఎదురైంది. ఇప్పటికైనా దమ్ముంటే నన్ను డిస్ క్వాలిఫై చేసుకోండి. అంతేగానీ..
అమిత్ షా యాక్షన్.. పవన్ చెప్పినట్లే..
సీబీఐ నా మీద కేసు పెట్టబోతోందని, వాటికి భయపడి విదేశాలకు పారిపోవాలనుకుంటున్నానని కథనాలు రాసినవాళ్లపై ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, పీఎంవోను నిర్వహించే డీఓపీటీ శాఖకు ఫిర్యాదు లేఖను రాశాను. సీబీఐలోని కొందరు అధికారులు జగన్ తో కాంప్రమైజ్ అయిన విషయాన్ని కూడా అందులో ప్రస్తావించాను. నా లేఖపై కేంద్రం తప్పక స్పందిస్తుంది. అమిత్ షా కచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. నాపై తప్పుడు రాతలు రాసే ప్రతి ఒక్కరి తోలు తీసేదాకా ఊరుకోను. తోలు తీయడం అనే పవన్ కల్యాణ్ దే. నేను కూడా ఆయన అభిమానినే. తోలు తీస్తానని పవన్ డైలాగ్ చెప్పి ఊరుకుంటే, నేను ఆ పని చేసి చూపిస్తాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకా..
తిరుపతిలో రీపోలింగ్ పెట్టాల్సిందే..
ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా తిరుపతిలో దారుణమైన అక్రమాలు చోటుచేసుకున్నాయి. సునాయాసంగా గెలిచే సీటులో కూడా వైసీపీ ఇంతలా దిగజారడం అనవసరం. కాళహస్తి ఆలయం చూసే మిషతో వందల మంది దొంగ ఓటర్లు వచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఏం సాధించాలని జగన్ ఇంతలా తాపత్రయపడుతున్నాడో అర్థం కావట్లేదు, బహుశా 5లక్షల మెజార్టీ వస్తే భావి ప్రధానమంత్రినని ప్రచారం చేయించుకోడానికేమో, కానీ లక్షకు మించి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. పోలింగ్ అక్రమాలపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి. మొత్తం పార్లమెంట్ కు కాకున్నా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లోనైనా రీపోలింగ్ పెట్టాలి. దాదాపు 150 బూత్ లలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బీజేపీ నేతలు ఢిల్లీ స్థాయిలో పోరాడాలి. రీపోలింగ్ లేకుండా వైసీపీ గెలిస్తే అది గెపులు అన్నట్లే కాదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.