కేంద్రబడ్డెట్ పై విజయసాయిరెడ్డి ఫైర్-ఏపీ నిర్భర్ ఏదీ అంటూ రాజ్యసభలో విసుర్లు
కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆక్షేపించారు. బడ్జెట్పై ఇవాళ రాజ్యసభలో జరిగిన చర్చలో బడ్జెట్లో ఆర్భాటం తప్ప విషయం లేదని విమర్శించారు. ఈ బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్...కానీ పేషెంట్ డెడ్ అన్నట్లుందని వ్యాఖ్యానించారు. ఇది యూపీ పంజాబ్ బడ్జెట్ అవుతుందేమోనని ఊహించామని, కానీ బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఇది ఏ రాష్ట్రానికి చెందని బడ్జెట్ అని తేలిపోయిందన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతున్న కేంద్రానికి ... రాష్ట్రాల ఆత్మనిర్భరత గుర్తుకు రాలేదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కేంద్రం తన హస్తలాఘవం ప్రయోగించి దారుణంగా తగ్గించిందని దుయ్యబట్టారు. బడ్జెట్ అంకెల ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్థూల పన్నుల ఆదాయంలో ఉద్దేశపూర్వకంగానే సెస్సులు, సర్చార్జీలను పెంచుకుంటూ పోయిందని అన్నారు. సెస్సులు, సర్ చార్జీల పేరిట వచ్చే ఆదాయంలో నయా పైసా వాటా కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేనందునే కేంద్రం దొడ్డిదారిలో ఈ పని చేస్తున్నదని సాయిరెడ్డి ఆరోపించారు. కేంద్రానికి వచ్చే స్థూల పన్నుల ఆదాయంలో డివిజబుల్ పూల్ కింద రాష్ట్రాలకు 41 శాతం వాటాను పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అయితే సెస్సులు, సర్చార్జీల పేరిట కేంద్రం వసూలు చేసే పన్నులు డివిజబుల్ పూల్ కిందకు రావని, ఫలితంగా డివిజబుల్ పూల్లో జమయ్యే స్థూల పన్నుల ఆదాయం గణనీయంగా తగ్గింది. దీని పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్కు పన్నుల పంపిణీలో దక్కాల్సిన వాటా 41 శాతానికి బదులు 29 శాతానికి పడిపోయిందని విజయసాయి రెడ్డి విమర్శించారు.

పెట్రోల్, డీజిల్పై విధించిన సెస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వం 3 లక్షల 35 వేల కోట్ల రూపాయల రెవెన్యూ ఆర్జించిందని,. ఇందులో అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది కేవలం 5.8 శాతం...అంటే 19,475 కోట్ల రూపాయలు మాత్రమేనని సాయిరెడ్డి ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం డివిజబుల్ పూల్ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్ వాటా నానాటికీ తగ్గిపోతున్నదని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. 13వ ఆర్థిక సంఘం (2010-15) సిఫార్సుల ప్రకారం డివిజబుల్ పూల్లో ఆంధ్రప్రదేశ్ వాటాను 6.9 శాతంగా నిర్ధారించగా, 14వ ఆర్థిక సంఘం (2015-20) దానిని 4.3 శాతానికి తగ్గించింది. అంటే 2.6 శాతం తగ్గింది. 15వ ఆర్థిక సంఘం (2021-2026) సిఫార్సుల ప్రకారం డివిజబుల్ పూల్లో ఏపీ వాటా 4.1 శాతానికి పడిపోయిందని సాయిరెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications