ఆలయాల్లో చోరీలన్నీ చంద్రబాబు హయంలోనే !? అప్పుడు బెజవాడ..ఇప్పుడు తిరుపతి.. వైఎస్ఆర్సీపీ ఏం చెబుతోంది
Recommended Video
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు వ్యవహారశైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వంటి జాతీయ అంశాలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేస్తోన్న విమర్శలను ఆధారంగా చేసుకుని విజయసాయి రెడ్డి మరోమారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీగోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం కావడానికీ చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారాయన.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక ఆలయాల్లో దొంగతనాలు చోటు చేసుకుంటాయని ఆరోపించారు. దేవుళ్ల ఆభరణాలకు చంద్రబాబు నుంచే ముప్పు పొంచి ఉందని ఆయన చురకలు అంటించారు. దేవుళ్ల అభరణాలకు చంద్రబాబు నుంచే ముప్పు ఉందని మండిపడ్డారు. 1998లో విజయవాడలో ప్రఖ్యాత కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నగలు చోరీకి గురయ్యాయని, అప్పుడు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. కనకదుర్గమ్మ అమ్మవారి నగల చోరీకి గురైన కేసులో ప్రకాశ్ సాహు అనే దొంగను పట్టుకొచ్చి ఇరికించారని ఆరోపించారు.
తాజాగా- తిరుపతిలో శ్రీగోవిందరాజ స్వామి కిరీటాలు మాయమైనప్పుడు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. చోరీకి గురైన మూడు కిరీటాలు కూడా దొరికాయని అంటూ పోలీసులు కరిగించిన బంగారాన్నిచూపుతున్నారని, దాన్ని నమ్మేదెలా అని ప్రశ్నించారు. తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి శ్రీకృష్ణదేవ రాయలవారు సమర్పించిన అనేక వజ్రాభరాణాల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదని అన్నారు.
చంద్రబాబుకు ఎందుకు నొప్పి
ఈస్టర్ సండే పర్వదినం నాడు శ్రీలంకలో చోటు చేసుకున్న నరమేథాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆ దేశానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారని, చంద్రబాబు దీన్ని కూడా తప్పు పడుతున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. శ్రీలంకకు మోడీ మద్ధతు ఎలా ప్రకటిస్తారని చంద్రబాబు సూటిగా ప్రశ్నిస్తున్నారని, ఇందులో అర్థమే లేదని అన్నారు. చంద్రబాబు ఏదో అయ్యిందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒక దేశానికి మరో దేశ ప్రధాని ఓ భరోసా, ఓ ఓదార్పు ఇవ్వడం వల్ల చంద్రబాబుకు నొప్పెందుకని నిలదీశారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగా దిగజారినట్టుందని విమర్శించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రష్యన్లు హ్యాక్ చేస్తున్నారంటూ చంద్రబాబు మోకాలికి బోడిగుండుకు లంకె పెడుతున్నారని చెప్పారు. ఈ సమాచారాన్ని ఆయన ఎక్కడి నుంచి సంపాదించారని ప్రశ్నించారు. దీన్ని- ఓటమి గుబులు నుంచి పుట్టిన కాల్పనిక గాథగా సాయిరెడ్డి అభివర్ణించారు. ఐటి గ్రిడ్స్ నుంచి చంద్రబాబు పంజాబ్ ప్రజల సమాచారాన్ని లాగినట్టు కాదని చెప్పారు.