బహిరంగ రహస్యం ఒప్పుకున్న విజయసాయి.. పేరంటాలతో టీడీపీ నేతలు బిజీ.. ఆఫీసులో కరోనా సెంటర్
కరోనా మహమ్మారి కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేశానన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) రమేశ్ కుమార్ పై చంద్రబాబు ఒత్తిడి పనిచేసిందని, సీఎంకు, సెక్రటరీలకు మాట మాత్రమైనా చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించిన వైసీపీ.. ఎస్ఈసీపై ఏకంగా సుప్రీంకోర్టులోనే దావా వేసింది. సర్కారుతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తోన్న ఎస్ఈసీ రమేశ్ కూడా.. కరోనా వ్యాప్తి లేదని కేంద్రం చెబితే.. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ముందుకొచ్చారు. మొదటి నుంచి మలుపులు తిరుగుతోన్న ఎన్నికల వాయిదా వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

బూచికి భయపడట్లేదేం?
కరోనా కారణంగానే స్థానిక సంస్థల్ని ఆరువారాల పాటు వాయిదా వేశానన్న ఎస్ఈసీ.. నామినేషన్ల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న హింసాయుత ఘటనలపైనా కీలక ఆదేశాలిచ్చారు. పలు జిల్లాల్లో ముఖ్య అధికారులపై చర్యలకు సిఫార్సు చేశారు. కాగా, ఏ కరోనాను బూచిగా చూపించి టీడీపీ నేతలు ఎన్నికల్ని వాయిదా వేయించారో.. ఆ వైరస్ గురించి చింత లేకుండా టీడీపీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారని, పెళ్లిళ్లు, పేరంటాలతో పచ్చనేతలు బిజీగా గడుపుతున్నారని విజయసాయి తెలిపారు.

అదే నిజం..
స్థానిక ఎన్నికల వేళ టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వైసీపీలోకి వలసలు పోతున్న నేపథ్యంలో, వాటిని నిలువరించడానికే చంద్రబాబు.. ఎన్నికల కమిషన్ లోని తన మనిషి ద్వారా వాయిదా ప్రక్రియకు తెరలేపారనే ప్రచారం కొద్దిరోజులుగా ఏపీలో సాగుతున్నది. బహిరంగా రహస్యంగా జనం చెప్పుకుంటున్న ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ కూడా పరోక్షంగా అంగీకరించారు. నాయకులు పార్టీ వీడిపోతుంటే దాన్ని అడ్డుకోడానికే ఎన్నికల వాయిదా అనే దిక్కుమాలిన పనికి చంద్రబాబు ఒడిగట్టాడని విజయసాయి అంగీకరించారు.

ఇంకెన్ని చూడాలో..
‘‘కరోనాను బూచిగా చూపెట్టి ఎన్నికల్ని వాయిదా వేయడం మంచి నిర్ణయమట. పచ్చ నేతలు మాత్రం వేడుకలకు వెళుతూ, వీడియో కాన్ఫరెన్సులు పెడుతూనే ఉన్నారు. వీళ్ల వ్యవహారం.. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది. ఇంకెన్ని విచిత్రాలు చూడాలో! స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయించి తానేదో గెలిచినట్లు చంద్రబాబు ఫీలవుతున్నాడు. ఆరు వారాల తర్వాతైనా ఎన్నికలు తప్పవని మర్చిపోవద్దు. ప్రజలే తగిన శిక్ష విధించే రోజులు ఎంతో దూరం లేవు''అని విజయసాయి విరుచుకుపడ్డారు.
Recommended Video

టీడీపీ ఆఫీసులో కరోనా టెస్టులు..
కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదాపడ్డాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ అప్రమత్తమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కరోనా సెంటర్ ప్రారంభించింది. ఆఫీసుకు వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications