కంటెంట్ లేని ప్రజా కంటకులు తండ్రీకొడుకులు: ఆత్మఘోష భవన్లో ప్రేతాత్మలా: సాయిరెడ్డి
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్నూ వదల్లేదు. వారిద్దరినీ ప్రజాకంటకులుగా అభివర్ణించారు. సంక్షేమ పథకాలకు అడ్డుపడుతూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోన్నారని మండిపడ్డారు.
ప్రజల నుంచి తిరస్కారానికి గురైనందు వల్లే ఆత్మఘోష భవన్లో ప్రేతాత్మలా మారిపోయారంటూ సాయిరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజూ అర్ధరాత్రి తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మతో మాట్లాడుతాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సాయిరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎదురు దాడి చేశారు. చంద్రబాబు ఆత్మను అమ్ముకున్నాడని విమర్శించారు అసలు ఆత్మేలేని ప్రేతాత్మగా చంద్రబాబును అభివర్ణించారు.

తండ్రిలాంటి తనకే వెన్నుపోటు పొడిచాడని పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు తరచూ చెబుతుండేవారని గుర్తు చేశారు. ఆత్మవంచన చేసుకుంటూ ఆత్మఘోష్ భవన్లో ప్రేతాత్మలా పేలడం తప్ప చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టవని ధ్వజమెత్తారు. ఎవరో రాసిన పలుకులను తాము పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకరు రాసిన సారాంశాన్ని జనం మీద రుద్దడం తప్ప సొంతంగా ఆలోచించలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు, నారా లోకేష్..చివరికి కంటెంట్ లేని కంటకులు మారిపోయారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు టీడీపీలో గౌరవం లేదని, శోభా హైమావతి విషయంలోనూ అదే జరిగిందని సాయిరెడ్డి అన్నారు. పార్టీ లేదు బొక్కాలేదన్న వాడికి మొర పెట్టుకుంటే లాభం లేదనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేశారని చెప్పారు. తమ పార్టీలో మహిళలే మహారాణులని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికే తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పదవులను వేలం వేసి అమ్ముకున్న నీచ చరిత్ర టీడీపీకి ఉందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications