విజయసాయిరెడ్డికి వైవీ సుబ్బారెడ్డి ఘాటు కౌంటర్..! కోటరీ, లిక్కర్ కామెంట్స్ పై..!
ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అనూహ్యంగా పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. తాజాగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ముఖ్యంగా పార్టీని వీడాక చెప్పలేని చాలా విషయాల్ని తాజాగా బయటపెట్టేస్తున్నారు. వీటికి సాక్షి మీడియాలో వస్తున్న కౌంటర్లతో ఆయన మరింత స్వరం పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం విచారణకు సాక్షిగా హాజరైన సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో జగన్ చుట్టూ కోటరీని తట్టుకోలేకే తాను పార్టీ నుంచి, రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సాయిరెడ్డి మరోమారు వెల్లడించారు. పార్టీలో నంబర్ టూగా తనను ఈ కోటరీ 2 వేల స్ధానానికి పడేసిందన్నారు. అలాగే వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలోనూ ఫైర్ అయ్యారు. సీఐడీ సిట్ అడిగితే మరిన్ని వివరాలు ఇచ్చేందుకూ సిధ్దమన్నారు. దీనిపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ స్పందించారు.

వైసీపీలో నెంబర్ 2 స్ధానం ఎవరికీ లేదని, పార్టీ అధ్యక్షుడే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఆ విషయం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తెలుసని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ వివరణ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కోటరీ కోటరీ అంటూ మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. పార్టీలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ఆశయాలను ప్రతి ఒక్కరు అమలు చేస్తారన్నారు. పార్టీలో కోటరీ అనే పదానికి చోటు లేదన్నారు.
విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కోటరీని ఎవరు నడిపారో విజయసాయికి తెలియదా అని నిలదీశారు. తమ పార్టీలో ఒకటి నుంచి వంద వరకు జగనే అన్నారు. లిక్కర్ సహా అనేక అంశాలపై కేసులు పెడుతున్నారని, తమ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications