ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం:వైసిపి సభ్యుల ఆందోళన, శాసనసభ వాయిదా
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం నాడు ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు దఫాలు వాయిదా పడింది. విపక్ష వైసిపి సభ్యులు సభ కార్యక్రమాలకు అడ్డుతగలడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేశారు.
అమరావతి:ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం నాడు ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు దఫాలు వాయిదా పడింది. విపక్ష వైసిపి సభ్యులు సభ కార్యక్రమాలకు అడ్డుతగలడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేశారు.
కరువు సమస్యపై చర్చించేందుకు తామిచ్చిన వాయిదా తీర్మాణన్ని అనుమతివ్వాలని వైసిపి సభ్యులు పట్టుబట్టారు. అయితే ఈ సమయంలో వైసిపి సభ్యులు చర్చకు పట్టుబట్టారు.ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాక కరువుపై చర్చించేందుకు సిద్దమని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అయినా వైసిపి ఎమ్మెల్యేలు వినలేదు.ఈ దశలో ప్రభుత్వ చీప్ విప్ కాలువ శ్రీనివాసులు ,మంత్రి యనమల రామకృష్ణుడు వైసిపి ఎమ్మెల్యేల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వైసిపి సభ్యులు తమ నిరసనను కొననాగించారు.దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసనసభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.
శాసనసభ తిరిగి ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ సభలో వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చిన నిరసన వ్యక్తం చేశారు.మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దే నిలబడి ఆందోళన చేశారు.ఈ సమయంలో వైసిపి ఎమ్మెల్యే రోజా అంశాన్ని టిడిపి ఎమ్మెల్యే అనిత ప్రస్తావించారు.రోజా టేపుల అంశాన్ని ఆమె సభలో ప్రస్తావించారు. రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టిడిపి సభ్యురాలు అనిత ప్రస్తావించారు.
వైసిపి ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వైసిపి అధినేత జగన్ పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.తహసీల్దార్ వనజాక్షి విషయంలో తనపై బురదచల్లేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గంలో పర్యటించి తాను ఎలాంటి వాడినో విచారణ చేసుకోవాలని ఆయన వైసిపికి సవాల్ విసిరారు.వనజాక్షిపై తాను దాడి చేసినట్టు రుజువు చేస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొంటానని ఆయన ప్రకటించారు.మహిళలను అడ్డుపెట్టుకొని జగన్ రాజకీయాలు చేస్తున్నాడని ఆయన ఆరోపణలు గుప్పించారు.వీధి రౌడిల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.