హైకోర్టు తీర్పులపై కేంద్రం జోక్యం కోరిన వైసీపీ- అమరావతి, ఫైబర్ గ్రిడ్పై సీబీఐ విచారణ కూడా..
గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హైకోర్టులో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న పలు తీర్పులపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ రెండు రోజులుగా పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంది. కోర్టు తీర్పులపై చట్ట సభల్లో చర్చించేందుకు అవకాశం లేకపోయినా వైసీపీ ఎంపీలు మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అమరావతి వ్యవహారం, హైకోర్టు తీర్పు, మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పాత్ర వంటి అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు. హైకోర్టు తీర్పులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు ప్రయత్నాలు చేసిన వైసీపీ ఎంపీలు.. ఇవాళ పార్లమెంటు నుంచి బయటికి రాగానే ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పేశారు.

హైకోర్టు తీర్పులపై కేంద్రం జోక్యం..
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇవాళ కోరారు. హైకోర్టు తీర్పుల వ్యవహారంపై పార్లమెంటులో ప్రస్తావించిన సాయిరెడ్డి.. అనంతరం బయటికి వచ్చాక దీనిపై మరోసారి మాట్లాడారు. ఏపీలో న్యాయవ్యవస్ధ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని, హైకోర్టు పక్షపాత ధోరణితో అసాధారణ రీతిలో తీర్పులు ఇస్తోందని విజయసాయి ధ్వజమెత్తారు. అయితే తాము జడ్జిలకు ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించడం లేదన్నారు. కేవలం తీర్పులపైనే తమ అభ్యంతరమన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు ఇవే అంశాలపై కేంద్రం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించడంతో పాటు పార్లమెంటు వెలుపల కూడా ప్రస్తావించడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

మీడియా నోరు నొక్కుతున్న కోర్టులు..
అమరావతిలో భూముల స్కాంపై ఏసీబీ ఎఫ్ఐఆర్ను మీడియా కవర్ చేయకుండా న్యాయస్ధానాలు అడ్డుపడుతున్నాయని, ఇది కచ్చితంగా పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీ హైకోర్టు ఏసీబీ ఎఫ్ఐఆర్పై వార్తలు ప్రసారం చేయకుండా నిషేధం విధించడంపై మాట్లాడుతూ మీడియా వార్తలు కవర్ చేయకుండా అసాధారణ పరిస్ధితుల్లో మాత్రమే నిషేధం విధిస్తారని సాయిరెడ్డి తెలిపారు. దీనిపైనా కేంద్రం జోక్యం చేసుకోవాలని సాయిరెడ్డి కోరారు. తద్వారా మీడియా స్వేచ్ఛపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వైసీపీ కోరినట్లయింది.

అమరావతి, ఫైబర్ గ్రిడ్పై సీబీఐ విచారణ...
అమరావతితో పాటు ఫైబర్ గ్రిడ్పైనా కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఇవాళ పార్లమెంటు వెలుపల వైసీపీ ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై సీబీఐ విచారణ చేయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్రం వెంటనే స్పందించి ఆయా అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై ఆరోపణలు ఉండటంతో ఈ కేసులు కూడా పార్లమెంటుకు వచ్చిన ఎంపీల దృష్టిని ఆకర్షించాయి.
Recommended Video

కేంద్రం జోక్యం చేసుకుంటుందా ?
ఏపీ హైకోర్టు తీర్పులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వైసీపీ కోరుతున్నా కేంద్రం ఆ దిశగా స్పందించే అవకాశాలు లేవనే తెలుస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుల విషయంలోనే గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఇరుకున పడిన సందర్భాలు ఉన్నాయి. మోడీ హయాంలోనూ పలు కేసుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తీర్పులిచ్చింది. ఏపీలోనూ హైకోర్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పలు తీర్పులు ప్రకటించింది. అయితే గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరలేదు. కోరినా కేంద్రం స్పందించే అవకాశాలూ ఉండకపోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications