షర్మిలపై అసత్య ప్రచారం: బుట్టా రేణుక, కొత్తపల్లి గీత
హైదరాబాద్: తమ పార్టీ నేత వైయస్ షర్మిలకు తాము అండగా ఉంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకులు, పార్లమెంటు సభ్యులు చెప్పారు. సోషల్ మీడియాలో షర్మిలను కించపరుస్తూ దుష్ప్రచారం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
శనివారంనాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపిలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడారు. మహిళలను ప్రోత్సహించాలే గానీ వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా అసభ్యంగా చిత్రీకరించడం దారుణమని కర్నూలు ఎంపి బుట్టా రేణుక అన్నారు.
రాజకీయాల్లో మహిళలు రాణించకుండా చేయడానికి కొన్ని వెబ్సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజా సమస్యల కోసం సుదీర్ఘం పాదయాత్ర చేసిన షర్మిలపై అసత్యం ప్రచారం చేయడం తగదని అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత అన్నారు.
అలాంటి సంఘటలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, మహిళలకు అండగా ఉండాలని వారన్నారు. అంతకు ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి వారు ఫిర్యాదు చేశారు.