జ్వరం వచ్చిన పవన్ కళ్యాణ్ చేస్తుందిదే: ఫోటోలతో వైసీపీ రచ్చ!!
తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్న పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు వారాహి విజయ యాత్రకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భీమవరం పెదఅమిరం లోని నిర్మలా దేవి ఫంక్షన్ హాల్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని జనసైనికులు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ అంత తీవ్రమైన జ్వరంలోనూ తన వల్ల సినిమా టీజర్ ఆలస్యం కాకూడదని బ్రో సినిమాకు డబ్బింగ్ చెప్పారు.
స్వయంగా ఆ సినిమా డైరెక్టర్ సముద్రఖని ప్రత్యేక బృందం అంతా పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్న ప్లేస్ కి వెళ్లి మరీ అక్కడే డబ్బింగ్ చెప్పించుకున్నారు. గత రెండు వారాలుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతూ కూడా 29 న విడుదల కావాల్సిన బ్రో సినిమా టీజర్ కోసం డబ్బింగ్ చెప్పారు.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం బ్రో. ఇక ఈ చిత్రం కోసం పవన్ డబ్బింగ్ చెప్పడాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తప్పు పడుతున్నారు. జ్వరం వచ్చింది రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పిన పవన్, రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంటున్నారని ఇది పవన్ మార్కు రాజకీయం అంటూ మండిపడుతున్నారు.
పవన్ కు రాజకీయాల మధ్యలో సినిమాలకు బ్రేక్ తీసుకోవడం అలవాటేనని ఎద్దేవా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సినిమా డబ్బింగ్ చెప్పుకోవడం కోసం జ్వరం వచ్చిందని డ్రామాలాడుతున్నారని, అన్నీ అబద్ధాలేనని మరికొందరు విరుచుకుపడుతున్నారు. అనారోగ్యంతో రెండురోజులు రాజకీయాలకు విరామం ప్రకటించిన పవన్ డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని చెబితే, అది చేయకుండా సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రమైన జ్వరం లో కూడా సినిమాకు డబ్బింగ్ చెప్పడం పవన్ కు ఉన్న కమిట్ మెంట్ కు నిదర్శనమని కొరియా ఆడుతున్నారు. అది పవన్ డెడికేషన్ అంటూ కితాబు ఇస్తున్నారు. రాజకీయాలు చేయాలంటే సినిమాలు చేయాల్సిందేనని పవన్ కళ్యాణ్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ విషయం పట్ల వైసీపీ జనసేన మధ్య వార్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications